'కాపు గర్జన'పై గంటా ఫైర్, రెచ్చగొట్టొద్దు: టిడిపికి నటుడు సుధాకర్ హెచ్చరిక
విశాఖ: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన 'కాపు గర్జన' సభ పైన మంత్రి గంటా శ్రీనివాస రావు ఆదివారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలను, కాపులను రెచ్చగొట్టేందుకే ఈ సభను నిర్వహిస్తున్నారని విమర్శించారు.
కాపులంతా ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని చెప్పారు. కాపు గర్జన పేరుతో రాజకీయం చేయడం ఏమాత్రం సరికాదని చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీలు కాపులను రెచ్చగొడుతున్నాయన్నారు. కాపులకు తమ పార్టీ పెద్ద పీట వేసిందన్నారు.
కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని చెప్పారు. అలాగే కాపు కార్పోరేషన్ ఏర్పాటు చేశామన్నారు. కాపులను బీసీలలో చేర్చేందుకు కమిటీ కూడా వేసినట్లు గంటా గుర్తు చేశారు.
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు: వట్టి, సిఆర్
కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు చంద్రబాబుదేనని కాంగ్రెస్ పార్టీ నేతలు సి రామచంద్రయ్య, వట్టి వసంత్ కుమార్ ఆరోపించారు. కాపు గర్జనకు వీరిద్దరు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాపులకు ఇచ్చిన హామీని చంద్రబాబు నెరవేర్చాలన్నారు.
గతంలో ఏర్పాటు చేసిన పుట్టుస్వామి కమిషన్ ఉండగా మరో కమిషన్ ఎందుకని ప్రశ్నించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయవచ్చునని అభిప్రాయపడ్డారు. కాపులను బీసీల్లో చేర్చేంత వరకు పార్టీలకు అతీతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు.
టీడీపీ అంతా కాపులే: బోండా
కాపు గర్జనను అడ్డుకునే అవసరం ప్రభుత్వానికి లేదని, కాపు సామాజిక వర్గం టీడీపీతోనే ఉందని ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వర రావు అన్నారు. బీజేపీ, వైసిపి, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ నుంచి కాపులను వేరు చేయలేరన్నారు.
కాపు కొర్పొరేషన్ కోసం రూ.100 కోట్లు కేటాయించామని, కాంగ్రెస్ హయాంలో కాపులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదన్నారు. రాజకీయ లబ్ధి కోసమే కాపు అంశాన్ని ఆ పార్టీలు తెరపైకి తెస్తున్నాయని ఆరోపించారు. టిడిపిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న కన్నా లక్ష్మీనారాయణకు తమ పార్టీని విమర్మించే హక్కు లేదన్నారు.
కాపులను రెచ్చగొట్టొద్దు: నటుడు సుధాకర్ నాయుడు
కాపులు వారి సమస్యల పరిష్కారం, రిజర్వేషన్ కోసం ఓ సభను పెట్టుకుంటుంటే దానిని ఆపాలని ప్రయత్నం చేయడం రెచ్చగొట్టడమేనని, ఇటువంటి ధోరణిని పాలకులుమానుకోవాలని ప్రముఖ నటుడు సుధాకర్ నాయుడు (జీవీ) విమర్శించినట్లుగా తెలుస్తోంది.
1988లో వంగవీటి మోహన్ రంగా పిలుపు మేరకు విజయవాడలో కాపునాడు సభ జరిగితే అందులో ముద్రగడ పద్మనాభం ముఖ్య భూమిక పోషించారన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కాపులను కేవలం ఓటు బ్యాంకులుగా ఉపయోగించుకొని వదిలేశాయన్నారు.
ముద్రగడ పద్మనాభం తునిలో సభకు పిలుపునిస్తే కాపులంతా సభకు తరలి వెళ్తున్నారన్నారు. వారిని అడ్డుకోవడం సరికాదన్నారు. ఏ పార్టీకి సంబంధం లేకుండా జరుగుతున్న ఈ సమావేశం విజయవంతం కావాలని చెప్పారు.