Kadapa MP: కడప లోక్ సభ సీటులో క్రాస్ ఓటింగ్ ? షర్మిలకే టీడీపీ ఓట్లు.. !
ఏపీలో ఈసారి ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో కడప లోక్ సభ స్ధానం కూడా ఒకటి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య దర్యాప్తును అడ్డుకుంటున్నారన్న కారణంతో అన్న జగన్ పైనే వార్ ప్రకటించిన పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల.. తనకు పట్టున్న కడప లోక్ సభ సీటులో పోటీకి దిగారు. అక్కడ వరుసగా రెండుసార్లు గెలిచి హ్యాట్రిక్ కోసం చూస్తున్న వివేకా కేసు నిందితుడు, తన సోదరుడూ అయిన వైఎస్ అవినాష్ రెడ్డిని ఎలాగైనా ఓడించాలనే కోరికతో షర్మిల పోటీ చేశారు.
కడప లోక్ సభ సీటుకు ఈసారి జరిగిన ఎన్నికల్లో అన్ని అజెండాలూ పక్కకుపోయి వివేకా హత్య ప్రధాన అజెండాగా మారిపోయింది. న్యాయం కోసం వివేకా కుమార్తె చేస్తున్న పోరాటానికి తోడైన వైఎస్ షర్మిల.. వ్యూహాత్మకంగా ఈ సీటులో పోటీకి దిగడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. ఈ క్రమంలో వివేకా హత్య కేంద్రంగా షర్మిల, సునీత గుప్పించిన విమర్శలు ఓ దశలో పతాకస్థాయికి చేరుకున్నాయి. వీటిని అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కడప కోర్టును ఆశ్రయించి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో కొంగుచాచి ఓటు అడుగుతున్నా, న్యాయం చేయాలంటూ వివేకా కుమార్తెతో పాటు షర్మిల చేసిన వ్యాఖ్యలు అసలే సెంటిమెంట్ ఎక్కువగా ఉండే సీమ ఓటర్లను ఎక్కడో తాకినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలకు అతీతంగా రష్మిలకు ఈసారి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన పోలింగ్ సరళిని దగ్గరిగా గమనించిన వారు, ఇంకా చెప్పాలంటే ఓటేసిన వారు సైతం ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు.
అన్నింటికంటే ముఖ్యంగా జగన్ కు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న టీడీపీ సైతం తమ అభ్యర్ధి భూపేష్ రెడ్డిని కాదని ఈసారికి షర్మిలకే ఓటేయాలని క్యాడర్ కు సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. దీంతో ఆ పార్టీ క్యాడర్ అంతా ఎమ్మెల్యే ఓటును తమ అభ్యర్ధులకు వేసి ఎంపీ ఓటు మాత్రం షర్మిలకే వేసినట్లు సమాచారం. అయితే ఇంత చేసినా రేపు షర్మిల కచ్చితంగా గెలుస్తుందని చెప్పలేని పరిస్ధితి. ఎందుకంటే కడప జిల్లాలో సంప్రదాయంగా వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకే కారణం.












Click it and Unblock the Notifications