బీసీ కార్డు: తెలంగాణలో టిడిపి ప్రచార సారథి కృష్ణయ్య?
హైదరాబాద్: తెలంగాణలో ప్రచార సారథిగా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యను నియమించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. కాగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ప్రకటించాలని కృష్ణయ్య అడుగుతున్నారు. కానీ ప్రచార సారథిగా నియమించి, ప్రస్తుతానికి వివాదానికి తెర దించాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది.
కృష్ణయ్యను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని తెలంగాణ బిసి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే, పార్టీలోని బీసి నేతలు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. పార్టీలో ఉన్న తమను కాదని, బయటి నుంచి వచ్చిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం సరి కాదని వారు వాదిస్తున్నారు. దీంతో బిసిని ముఖ్యమంత్రి గా చేస్తామని ప్రకటించి కృష్ణయ్యకు ప్రచార బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కృష్ణయ్యకు ప్రచార బాధ్యతలు అప్పగించి పార్టీ తెలంగాణ నేతలకూ కీలక బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. దీనిలో భాగంగా ఆ ప్రాంతానికి కొన్ని కమిటీలను త్వరలో ప్రకటించబోతున్నారు. తెలంగాణ ప్రాంతీయ కమిటీ సారథ్య బాధ్యతలు ఎమ్మెల్యే ఎల్. రమణకు అప్పగించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ పదవికి దేవేందర్ గౌడ్ పేరు కూడా పరిశీలనకు వచ్చినా ఆయన ఆరోగ్యం ఇంకా కుదుటపడకపోవడంతో పక్కనపెట్టారు.
ఇతర సామాజిక వర్గాలకు చెందిన వారికి సహ సారథ్య బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు, రేవూరి ప్రకాశ్రెడ్డి పేర్లు దానికి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు ప్రాధాన్యం తగ్గకుండా చూడటం కోసం పార్టీ మేనిఫెస్టో కమిటీ లేదా మరేదైనా కీలక కమిటీ బాధ్యతలు అప్పగించాలన్న ప్రతిపాదన ఉంది.