అక్రమ మైనింగ్ పై నేడు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటన .. కొనసాగుతున్న టీడీపీ నేతల హౌస్ అరెస్ట్ లు, టీడీపీ ఫైర్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమ మైనింగ్ వ్యవహారంపై ఆకట్టుకుంటోంది. ఒకపక్క విశాఖలో బాక్సైట్ గనుల తవ్వకం పై ఎన్జీటీ విచారణ కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయగా, మరోపక్క కొండపల్లి అక్రమ మైనింగ్ పై తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ ని ఏర్పాటు చేసి, ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనుంది. దీంతో పోలీసుల అరెస్ట్ లతో ఏపీలో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
వైసీపీ మైనింగ్ మాఫియా.. ఎన్జీటీ విచారణతో జగన్ రెడ్డి అండ్ కో, ఆ అధికారులకు చిప్పకూడే : నారా లోకేష్
కొండపల్లి అక్రమ మైనింగ్ పై నేడు టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ క్షేత్ర స్థాయి పరిశీలన
ఇటీవల కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారంలో దేవినేని ఉమాపై దాడి జరిగిన ఘటన, ఆపై దేవినేనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు కావడం, దేవినేని అరెస్టు ఆపై ఆయనకు రిమాండ్ విధించటం వంటి అనేక ఘటనలతో తెలుగుదేశం పార్టీ కొండపల్లి మైనింగ్ వ్యవహారంపై దృష్టిసారించింది. నిజ నిర్ధారణ కమిటీని వేసిన అధినేత చంద్రబాబు పది మంది సభ్యులతో రిజర్వ్ ఫారెస్ట్ కొండపల్లిలో అక్రమ మైనింగ్ పై విచారణ జరిపి, నిజానిజాలు తేల్చాలని పేర్కొన్నారు. దీంతో ఈ రోజు క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాల్సిన టిడిపి నేతలను పోలీసులు ఎక్కడికక్కడ గృహ నిర్బంధాలకు పాల్పడుతున్నారు.
కమిటీ సభ్యులను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు .. టీడీపీ నేతల వాగ్వాదం
కమిటీ సభ్యులైన తంగిరాల సౌమ్య ,నాగుల్ మీరా లను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. అదేవిధంగా గుంటూరులో నక్క ఆనంద్ బాబును, విజయవాడలో వర్ల రామయ్య, బోండా ఉమలను, మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర ,కొనకళ్ల నారాయణలను, జగ్గయ్యపేటలో నెట్టెం రఘురాం లను గృహనిర్బంధం చేశారు పోలీసులు. నిజ నిర్ధారణ కమిటీ క్షేత్రస్థాయి పర్యటనకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. వ్యక్తిగత పనుల మీద బయటకు వెళ్ళి తమను ఎలా అడ్డుకుంటారని నక్కా ఆనందబాబు కొల్లు రవీంద్ర పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
గుంటూరు, కృష్ణా జిల్లాలలో కొనసాగుతున్న వాహన తనిఖీలు .. టీడీపీ నేతల అరెస్ట్
పోలీసుల తీరును టిడిపి నేతలు తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇక ఇదే సమయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల సరిహద్దుల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. టిడిపి నేతలు ఎక్కడ కనిపించినా సరే వారిని అరెస్టు చేస్తున్నారు.. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ పై నిజ నిర్ధారణ కమిటీ నేడు విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం జరగకుండా అడ్డుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు మంగళగిరి టిడిపి ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద, కనకదుర్గమ్మ వారధి వద్ద వాహన తనిఖీలు కొనసాగిస్తున్నారు.
Recommended Video
గొల్లపూడిలోనూ చంద్రబాబు పర్యటన.. కొనసాగుతున్న ఉద్రిక్తత
ఎక్కడికక్కడ టిడిపి నేతలను అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉంటే గొల్లపూడి దగ్గర కూడా ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి దేవినేని ఉమ నివాసానికి చేరుకుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు దేవినేని ఉమా కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఈ నేపథ్యంలో గొల్లపూడిలో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వైసిపి దళిత సంఘాల నాయకులు చంద్రబాబుని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారం పలు ఉద్రిక్తతలకు కారణంగా మారింది.