బ్రాహ్మణి పొలిటికల్ గ్రాండ్ ఎంట్రీ? టీడీపీ సోషల్ మీడియా కోసం వర్క్షాప్..విందు: భర్తతో కలిసి..!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కోడలు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ భార్య బ్రాహ్మణి క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించడం దాదాపు ఖాయమైనట్టే. పార్టీకి బలమైన అనుబంధ విభాగంగా ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. భర్తతో కలిసి వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా పనితీరు పట్ల ఓ రూట్మ్యాప్ను సైతం రూపొందించినట్లు తెలుస్తోంది.
Recommended Video

అధికారంలో ఉన్నన్ని రోజులు..
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం అత్యంత క్రియాశీలకంగా ఉంటోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు, అమరావతి నిర్మాణ పనులను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. రాజధాని అమరావతి నిర్మాణం.. భవనాల డిజైన్లు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై ప్రధాన మీడియా కంటే కూడా విస్తృతస్థాయిలో ప్రచారం చేయగలిగింది. జనంలోకి వాటిని తీసుకెళ్లగలిగింది.

అధికార పార్టీకి కౌంటర్..
గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినప్పటికీ..క్యాడర్ మాట ఎలా ఉన్నా, పార్టీ సోషల్ మీడియా విభాగం ఏ మాత్రం డీలా పడలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదలుకుని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ చిన్న నాయకుడైనా చేసే వివాదాస్పద వ్యాఖ్యలపైనా నిమిషాల వ్యవధిలో కౌంటర్ ఇస్తోందని చెబుతున్నారు. విశాఖపట్నం విమానాశ్రయం వద్ద చంద్రబాబుపై చోటు చేసుకున్న దాడి ఘటనపై టీడీపీ సోషల్ మీడియా.. వైఎస్ఆర్సీపీతో ప్రధాన నాయకులను ఒక ఆట ఆడుకుందని, అధికారంలో ఉన్నప్పటికీ.. వారిని ఆత్మరక్షణలోకి నెట్టేసిన సత్తా ఉందని చెబుతున్నారు.

మరింత పదును పెట్టేలా..
ఇంతటి బలమైన విభాగాన్ని మరింత పదును పెట్టేలా నారా బ్రాహ్మణి చర్యలు తీసుకుంటున్నారని అంటున్నారు. హైదరాబాద్లో చంద్రబాబు సొంత నివాసంలో ఈ విభాగానికి చెందిన కొందరు ఎంపిక చేసిన కార్యకర్తలకు ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. నారా లోకేష్తో కలిసి వారి దిశా నిర్దేశం చేశారని చెబుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై దాడిని మరింత తీవ్రతరం చేయాలనే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీనిపై చిన్నస్థాయి వర్క్షాప్, పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో..
రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. పంచాయితీ రాజ్, మున్సిపల్, మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలను నిర్వహించడానికి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నారా లోకేష్, బ్రాహ్మణి.. సోషల్ మీడియా కార్యకర్తలతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రభుత్వ పనితీరును ఎండగట్టడానికి మరింత దూకుడును ప్రదర్శించాల్సి ఉంటుందని వారు దిశానిర్దేశం చేశారని సమాచారం.

క్రియాశీలక రాజకీయాల్లోకి..
ఈ సందర్భంగా బ్రాహ్మణిని క్రియాశీలక రాజకీయాల్లోకి రావాల్సిందిగా సోషల్ మీడియా కార్యకర్తలు సూచించగా.. ఇప్పటికే ఓ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించినట్లు చెబుతున్నారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనికి కొంత కసరత్తు చేయాల్సి ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయని నారా బ్రాహ్మణి స్పష్టం చేశారని తెలుస్తోంది. జిల్లాల్లో పర్యటన చేయాల్సి ఉందని, దానికోసం ఓ షెడ్యూల్ను రూపొందించుకుంటున్నామని ఆమె వెల్లడించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications