బిజెపికి 12 సీట్లకు బాబు ఓకే, మురళీ మోహన్పై నో?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల మధ్య పొత్తు పొడుస్తుందో లేదో అనుమానంగా కనిపిస్తోంది. రెండు రోజుల క్రితం వరకు పొత్తు ఉంటుందని బలంగా భావించారు. బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ తెలంగాణకు మద్దతిస్తామని ప్రకటించిన తర్వాత టిడిపి కొంత వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, విభజన అంశాన్ని పక్కన పెట్టి ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే ఆస్కారముందంటున్నారు.
అయితే, పొత్తు పొడవకముందే బిజెపి, టిడిపి ఆశావహులు, క్యాడర్లో మాత్రం సీట్ల పంపకంపై జోరుగా చర్చ సాగుతోందట. రాష్ట్రంలో 42 లోకసభ స్థానాలు ఉండగా మొత్తం పన్నెండు స్థానాలను బిజెపికి వదిలేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారట. తొమ్మిది తెలంగాణ ప్రాంతంలో, మూడింటిని సీమాంధ్రలో వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే తెలంగాణ ప్రాంతంలో 25, సీమాంధ్రలో 12 స్థానాలు ఇచ్చేందుకు టిడిపి సై అంటోందట.
విశాఖపట్నం, కాకినాడ, రాజంపేట లోకసభ స్థానాలను బిజెపికి ఇచ్చేందుకు చంద్రబాబు ఓకే చెబుతున్నారట. కానీ, సీమాంధ్ర బిజెపి నేతలు మాత్రం ఆ మూడింటితో పాటు విజయవాడ, రాజమండ్రి, నర్సాపురం స్థానాలను కూడా ఇవ్వాలని పట్టుబడుతోందట. బాబు మాత్రం ముఖ్యంగా రాజమండ్రి స్థానంపై ససేమీరా అంటున్నారట.
రాజమండ్రి నుండి 2009లో సినీ నటుడు మురళీ మోహన్ పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేయనున్నారు. ఆయనకు బాబు నుండి ఈ మేరకు హామీ కూడా లభించింది. 2009లో ఓడినప్పటికీ మురళీ మోహన్ రాజమండ్రిలో పలు కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లో ఉన్నారు. దీంతో మురళీ మోహన్ స్థానాన్ని ఇచ్చేందుకు చంద్రబాబు ససేమీరా అంటున్నారట.
తెలంగాణ విషయానికి వస్తే నల్గొండ, భువనగిరి, ఖమ్మం, నిజామాబాద్, అదిలాబాద్, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, మల్కాజిగిరి స్థానాలను మినహాయించి మిగతా స్థానాలను బిజెపికి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారట. అయితే టిడిపి, బిజెపిల మధ్య పొత్తు కుదురుతుందా, కుదిరినా సీట్ల పంపకంపై ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడే చెప్పడం కష్టం.