వైఎస్ వివేకా హత్యకేసులో టీడీపీ సంచలనం: బుక్లెట్ ప్రింట్: టైటిల్ ఇదే
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం.. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికార వైఎస్ఆర్సీపీని రాజకీయంగా ఎదుర్కొనడానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చేతికి చిక్కిన ఏకైక బలమైన అస్త్రంగా ఇది మారినట్టే కనిపిస్తోంది. వైఎస్ వివేకా హత్యోదంతం మొత్తాన్నీ వైఎస్ జగన్ మెడకు చుట్టే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ విఫలం కాకూడదనే పట్టుదల టీడీపీ నేతల్లో వ్యక్తమౌతోంది.
Recommended Video

అన్నింట్లోనూ చుక్కెదురే..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు నుంచే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై తన దాడిని కొనసాగిస్తూ వస్తోంది టీడీపీ. తమ పార్టీ కార్యకర్తలపై దాడులను తెర మీదికి తీసుకొచ్చింది. ఆ తరువాత మూడు రాజధానుల అంశంపై వ్యతిరేక ప్రదర్శనలను చేపట్టింది. అవినీతి ఆరోపణలను సంధించింది. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ సహా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు విషయాల్లో వైసీపీ ప్రభుత్వం విఫలమైందనే ప్రచారాన్ని చేపట్టింది. అవేవీ పెద్దగా ఫలించలేదనే విషయాన్ని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు తేల్చి పారేశాయి.

ఏకపక్షంగా విక్టరీ..
గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెడ్పీటీసీ-ఎంపీటీసీ.. ఇలా అన్ని స్థాయిల్లోనూ వైఎస్ఆర్సీపీ విజయదుందుభి మోగించింది. 90 శాతానికి పైగా ఓట్లను సాధించింది. ఈ వ్యవహారం తెలుగదేశం పార్టీకి మింగుడు పడలేదు. అయినప్పటికీ- తన ప్రచార ఉధృతిని మాత్రం తగ్గించలేదు. ప్రతి చిన్న విషయంపైనా వైసీపీ విఫలమైందంటూ ఆరోపణలను సంధించిన సందర్భాలు చాలా ఉన్నాయి.

తాజాగా వైఎస్ వివేకా హత్యోదంతంపై..
ఈ పరిణామాల మధ్య తాజాగా తెలుగుదేశం పార్టీ- వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతాన్ని తెర మీదికి తీసుకొచ్చింది. కొద్దిరోజులుగా తరచూ ఈ హైప్రొఫైల్ హత్యోదంతానికి సంబంధించిన వార్తలు వెలువడుతున్నాయి. వైఎస్ వివేకా కుమార్తె సునీత రెడ్డి, భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిల పేర్లు వినిపిస్తోన్నాయి. వైఎస్ జగన్కు వ్యతిరేకంగా ఆ ఇద్దరూ వాంగ్మూలాలను ఇచ్చారనే ప్రచారానికి తెర తీసింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ అనుకూల మీడియాలో ఇవే కథనాలు వరుసగా ప్రచురితమౌతోన్నాయి.

మరింత తీవ్రం..
ఈ ప్రచారాన్ని టీడీపీ మరింత తీవ్రతరం చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ హత్యోదంతంపై ఏకంగా ఓ 18 పేజీల బుక్లెట్ను ప్రచురించినట్లు చెబుతున్నారు. హు కిల్డ్ బాబాయ్ అనే పేరుతో దీన్ని విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా ఈ హత్యోదంతంలో కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ సాధించిన పురోగతి, నమోదు చేసిన ఛార్జ్షీట్లను ఈ బుక్లెట్లో పొందుపరిచినట్లు తెలుస్తోంది. 'వైఎస్ కోటలోనే వైఎస్ వివేకాను హత్య చేయడం అంతఃపుర అధినేత అండ లేకుండా సాధ్యమా?' అనే ట్యాగ్లైన్తో బుక్లెట్ను రూపొందించినట్లు చెబుతున్నారు.

అనేక ప్రశ్నలు..
గొడ్డలి వేటును ..గుండె పోటుగా ఎందుకు ప్రచారం చేశారు?..40 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చే స్థోమత ఎవరికి ఉంది?..సాక్షి మీడియా ఎందుకు నిందితులకు కొమ్ము కాస్తోంది.. అనే ప్రశ్నలను ఈ బుక్లెట్లో ప్రచురించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో వేసిన సిట్ విచారణను.. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఎందుకు నీరు గార్చింది?, పెద్దల భరోసా లేకుండా నిందితులు సీబీఐని బ్లాక్ మెయిల్ చేయగలరా?.. సానుభూతి ఓట్ల కోసం కోడికత్తి తరహాలో వివేకాను హత్య చేయించారా?.. అనే ప్రశ్నలను బుక్లెట్లో పొందుపర్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications