పవన్ కళ్యాణ్ ఎలా బయటకు రారో చూస్తాం, సిబ్బంది హల్చల్: విద్యుత్ నిలిపివేత, బౌన్సర్కు గాయాలు
Recommended Video

శ్రీకాకుళం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో బస చేసిన ప్రయివేటు కళ్యాణ మండపం వద్ద వివాదం చోటుచేసుకుంది. మంగళవారం అర్ధరాత్రి కళ్యాణ్ మండపం వద్దకు కొంతమంది విద్యుత్ సిబ్బంది వచ్చారు. పవన్ బయటకు రావాలని నినాదాలు చేశారు. అయితే, ఇఫ్పుడు ఆయన బయటకు రారని, బుధవారం ఉదయం వస్తే కలువవచ్చునని ప్రయివేటు సెక్యూరిటీ సిబ్బంది చెప్పారు.
పవన్ ఎలా బయటికి రాకుండా ఉంటారో చూస్తామంటూ విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది గొడవకు దారి తీసింది. గొడవలో పవన్ బౌన్సర్ సునీల్ కాలికి గాయమైంది. కాశీబుగ్గ సీఐ అశోక్ కుమార్ ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ బౌన్సర్ను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కళ్యాణ మండపానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.

పవన్కు పోలీసులు రక్షణ కల్పించకుండా ప్రభుత్వం అడ్డుకుంటోంది
కాగా, పవన్ కళ్యాణ్ చేపట్టిన పోరాట యాత్రలో ప్రభుత్వం తగిన రక్షణ చర్యలు కల్పించడం లేదని, అవాంఛనీయ సంఘటనలు జరిగితే ప్రకభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన తెలిపింది. ఈ నెల 20న ఇచ్చాపురంలో పవన్ పోరాట యాత్రకు శ్రీకారం చుట్టినప్పుడే నిబంధనల ప్రకారం అన్ని అనుమతులు కోరుతూ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకి విజ్ఞప్తులు ఇచ్చామని జనసేన ఉపాధ్యక్షులు బి మహేందర్ రెడ్డి తెలిపారు. పవన్కు పోలీసులు రక్షణ కల్పించకుండా ప్రభుత్వమే అడ్డుకుంటుందని సమాచారం వచ్చిందన్నారు.

ఏపీ ప్రభుత్వంపై ఉన్న కక్షతో ప్రజలకు శిక్షవద్దు
ఇదిలా ఉండగా, శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ ప్రత్యక హోదాపై మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు, చంద్రబాబు ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఏపీ విభజన సందర్భంగా పేర్కొన్న ప్రత్యేక హోదాను వెంటనే అమలు చేయాలని మోడీని కోరారు. ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న కక్షతో ప్రజలకు శిక్ష విధించవద్దన్నారు.

మోడీ గారూ ఒక్కటే చెప్పదల్చుకున్నా
జనసైనికుల సాక్షిగా, కష్టజీవులు, ఆడపడుచుల సాక్షిగా తాను మోడీని ప్రత్యేక హోదా అడుగుతున్నానని, తిరుపతి సభలో ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోవద్దని పవన్ కోరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన బాధ్యత మీపై ఉందన్నారు. నేను చెప్పేది ఇది ఒక్కటే అన్నారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ను వెంటనే ప్రకటించాలన్నారు. ఉత్తరాంధ్రలో వెనుకబాటుతనాన్ని పారదోలుతానని హామీ ఇచ్చారు.

జనసేనలో ప్రతి ఒక్కరు సైనికుడు అవుతారని హెచ్చరిక
ఇదే సమయంలో చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ చురకలు అంటించారు. హోదాపై రెండు నెలలకోసారి మాటమారిస్తే ప్రజలు మరిచిపోతారని అనుకోవద్దని చెప్పారు. ప్రభుత్వం విధించే జీఎస్టీ మాదిరి పలాసలో ఎమ్మెల్యే అల్లుడు విధించే ట్యాక్స్ చెల్లించాలా అని ప్రశ్నించారు. గతంలో ఇక్కడ టీడీపీ నేత ఆగడాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఉదంతాన్ని ఉదహరిస్తూ అతని ఉసురు కచ్చితంగా టీడీపీకి తగులుతుందన్నారు. ప్రజలను భయభ్రాంతుల్ని చేస్తే జనసేనలో ప్రతి ఒక్కరూ ఒక సైనికుడు అవుతాడని పాలకులను హెచ్చరిస్తున్నానని చెప్పారు. తప్పులు తెలుసుకొని ఇప్పటికైనా ఆపేయాలన్నారు.

ఉద్యోగుల సొమ్ముతో వ్యాపారమా?
చందా పింఛను పథకం రద్దు కోసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతానని జనసేన అధ్యక్షుడు పవన్ ఉద్యోగుల సమావేశంలో అన్నారు. ఉద్యోగుల సొమ్ముతో ప్రభుత్వం వ్యాపారం చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు కోసం ఎన్ని విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.












Click it and Unblock the Notifications