టీడీపీనుండే ముప్పు: బాబు అంటే కేసీఆర్కు భయమా, ఎందుకు?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితికి తెలుగుదేశం పార్టీ నుండే ప్రధానంగా ముప్పు పొంచి ఉందా? అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రధానంగా మొదటి నుండి టీడీపీని టార్గెట్ చేస్తున్నారా? అంటే తెలుగు తమ్ముళ్లు అవననే అంటున్నారు.
చాలా రోజులుగా వారు ఇదే వాదనను వినిపిస్తున్నారు. తమ నుండే తెరాసకు ముప్పు ఉందని, అందుకే తమనే కేసీఆర్ ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు పలు నిదర్శనాలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు, కార్యకర్తలు, అభిమానులు అంటున్నారు.
కార్యకర్తల బలం
తెలుగుదేశం పార్టీకి మొదటి నుండి తెలంగాణలో మంచి కార్యకర్తల బలం ఉంది. తెలంగాణ వాదం, సెంటిమెంట్ నేపథ్యంలో అది తగ్గింది. ఇప్పుడు ఎలాగూ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ మరికొన్నాళ్లు మాత్రమే తెలంగాణ సెంటిమెంటును ఉపయోగించుకోగలదని, మరెన్నాళ్లో అది సాగదని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ తిరిగి పుంజుకుంటుందని భావిస్తున్నారు.

మేమే తెచ్చామని చెప్పినా 63 సీట్లే!
నిరుడు జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి 119 సీట్లకు గాను కేవలం 63 మాత్రమే వచ్చాయి. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలో, తెలంగాణ మా వల్లే వచ్చిందంటూ ఎన్నికలకు వెళ్లి సమయంలోనే తెరాసకు సీట్లు సగం కంటే కొంతే ఎక్కువ వచ్చాయని, తెలంగాణ వచ్చినందున, అదే సమయంలో తెరాస ప్రభుత్వం విఫలమైతే అది తమకే ప్లస్ అవుతుందని టీడీపీ భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చామని చెప్పినా...
తెలంగాణ రాష్ట్రం మేమే తెచ్చామని చెప్పిన తెరాసకు సగం సీట్లు మాత్రమే వచ్చాయి. అలాగే మేమే ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి కూడా ఎక్కువ సీట్లు రాలేదని, ఇరవై సీట్లకు అటు ఇటుగా మాత్రమే గెలుచుకుందని గుర్తు చేస్తున్నారు.
చంద్రబాబు పాలన
తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్న సమయంలోను ఎన్నికల్లో టీడీపీ ప్రభావం కాంగ్రెస్ కంటే తగ్గలేదని, టీడీపీని, చంద్రబాబును తెలంగాణ వ్యతిరేకిగా ఇతర పార్టీలు ముద్రవేసి ప్రచారం చేసినా తాము సత్తా చాటామని, ఇప్పుడు ఎలాగు తెలంగాణ వచ్చిందని, ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీకి పునర్వైభవం ఖాయమని అంటున్నారు. చంద్రబాబు పాలనను, కేసీఆర్ పాలనను ప్రజలు ఇప్పటికే బేరీజు వేసుకుంటున్నారని చెబుతున్నారు.
2019లో మాదే పీఠం
2019లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు, తెలంగాణ టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మహానాడులోని చంద్రబాబు ఇదే పాట పాడారు. అందుకు తమకు ఉన్న కార్యకర్తల బలమేనని చెబుతున్నారు. చాలామంది సెంటిమెంట్ను రెచ్చగొట్టడం వల్ల పార్టీకి తాత్కాలికంగా దూరమైనప్పటికీ.. ఇప్పుడు కేసీఆర్ పాలన వల్ల తిరిగి సైకిల్ వైపు వస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ భయం వల్లనే కేసీఆర్ అలా?
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో ముప్పు ఉందని భావించినందువల్లే కేసీఆర్ తమ పార్టీనే ప్రధానంగా టార్గెట్ చేశారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఆ మాటకు వస్తే.. తెలంగాణలో టీడీపీ బలంగా ఉన్నందునే.. మొదటి నుండి కేసీఆర్ టీడీపీని టార్గెట్ చేసుకున్నారని అంటున్నారు. ఆదే బలం టీడీపీకి తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications