కుప్పంలో ఎనిమిదో సారి చంద్రబాబు పోటీ: ఫోకస్ పెట్టిన జగన్: రేపే టూర్..!!
YS Jagan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపత్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల సమరానికి సమాయాత్తమౌతున్నారు.
ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం బహిరంగ సభలు ముగిశాయి. విశాఖపట్నం జిల్లా భీమిలీలో నిర్వహించిన సభ సందర్భంగా ఆయన ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు.

ఇదే దూకుడును కొనసాగించనున్నారు వైఎస్ జగన్. ఈ నెల 26వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించనున్నారు. కుప్పం ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న హంద్రీ-నీవా జలాలను ఈ పట్టణానికి విడుదల చేయనున్నారు. కుప్పం వాసుల కలను సాకారం చేయనున్నారు.
గన్నవరం నుంచి వైఎస్ జగన్ ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 9.35 గంటలకు తిరుపతి జిల్లా రేణిగుంట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి 10:25 నిమిషాలకు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం రాజుపేటకు చేరుకుంటారు. 10.40 నిమిషాలకు హంద్రీ-నీవా కాలువ వద్ద పూజలు నిర్వహించి నీటిని విడుదల చేస్తారు.

11:15 నిమిషాలకు శాంతిపురం మండలం గుండిశెట్టిపల్లె చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొంటారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆర్ కే రోజా.. ఇందులో పాల్గొంటారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం ఇది. 1989 నుంచి 2019 వరకు ఏడుసార్లు ఓటమి అనేదే తెలియకుండా ఇక్కడి నుంచి గెలుస్తూ వస్తోన్నారు. ఈ సారి కూడా ఆయనే పోటీ చేయనున్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఇదివరకే ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు హవాకు చెక్ పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు వైఎస్ జగన్.












Click it and Unblock the Notifications