టీడీపీ - జనసేన లెక్కలు "సెట్" అవుతున్నాయా - అక్కడే పీఠముడి..!!
ఏపీలో మరో సారి టీడీపీ -జనసేన పొత్తుకు రంగం సిద్దం అవుతోంది. కొంత కాలంగా జరుగుతున్న చర్చకు ముగింపు వచ్చే అవకాశం కనిపిస్తోంది. తాజాగా రెండు పార్టీల్లోనూ వేగంగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను ఓడించటమే లక్ష్యగా టీడీపీ - జనసేన కలవటానికి కొద్ది రోజులుగా సంకేతాలు ఇస్తున్నాయి. దీనికి సంబంధించి రెండు పార్టీల శ్రేయోభిలాషులు మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగా రెండు పార్టీ మధ్య పొత్తు ఉండాలని రెండు పార్టీల నుంచి ముఖ్యులు కోరుకుంటున్నా.. ఓపెన గా మాత్రం ముందుకు రావటం లేదు.
పొత్తు ఖాయమంటున్న నేతలు
అందులో భాగంగా రెండు పార్టీల కలయిక కు వీలుగా ముందస్తు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా.. టీడీపీ - జనసేన మధ్య సీట్ల పంపకం ప్రధాన అంశంగా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు పార్టీలు సీట్ల వ్యవహారం పైన చర్చలు చేయటం ద్వారా పరోక్షంగా బీజేపీ పైన ఒత్తిడి పెంచాలని..వారి వైఖరి పైనా స్పష్టత వచ్చే అవకాశం ఉందని రెండు పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. ఇంకా సమయం ఉండటంతో.. బీజేపీ విషయంలో వేచి చూసే ధోరణితో ఉంటూనే... ఒత్తిడి పెరిగే వ్యూహాలు అమలు చేయాలని భావిస్తున్నారు. జనసేన నుంచి 45-50 సీట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, టీడీపీ మాత్రం 25 సీట్ల వరకు పరిమితం కావాలని కోరుతోంది. దీనికి జనసేన అంగీకరించటం లేదు.
తగ్గేది లేదంటున్న జనసేనాని
అదే సమయంలో గోదావరి జిల్లాలతో తమ బలం ఈ సారి పరిమితం కాలేదని..రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్రలోనూ బలం పెరిగిందని జనసేన నేతలు వాదిస్తున్నారు. సీట్ల విషయంలో ఈ సారి జనసేన నుంచే పార్టీలో పలువురు ఆవావాహుల సంఖ్య పెరగటం.. గతం కంటే ఆదరణ ఉండటంతో సీట్ల సంఖ్యలో రాజీ పడకూడదనేది జనసేన అభిప్రాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో టీడీపీలో జనసేనకు సీట్ల సంఖ్యలో జాగ్రత్త పడకుంటే పార్టీలో ఎన్నికల వేళ..అంతర్గతంగా వచ్చే సమస్యల పైనా ఆలోచన జరుగుతోంది. దీంతో..ఈ రెండు పార్టీల మధ్య సీట్ల వ్యవహారం కీలకంగా మారుతోంది. గతంలోనే పవన్ కళ్యాణ్ టీడీపీ తగ్గాలంటూ వ్యాఖ్యలు చేసారు. ప్రధానంగా సీట్ల విషయంలోనే ఈ వ్యాఖ్యలు చేసారనేది విశ్లేషకుల అభిప్రాయం.
టీడీపీలోనూ అదే సమస్య
దీని పైన టీడీపీ నుంచి సానుకూల స్పందన వస్తేనే పొత్తు పైన ముందుకు వెళ్లాలని జనసేన భావిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో.. జనసేనాని వరుసగా పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్రలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్త యాత్రకు నిర్ణయించారు. దీంతో.. ఎన్నికలకు సమయం ఉన్నా.. అభ్యర్ధుల ఎంపిక పైన ఇప్పటికే టీడీపీలో కసరత్తు ప్రారంభమైంది. సర్వేలు చేయిస్తున్నారు. నివేదికల ఆధారంగా పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ లకు పార్టీ అధినేత సూచనలు చేస్తున్నారు. అదే సమయంలో టిక్కెట్ల కేటాయింపు విషయంలోనూ క్లారిటీ ఇస్తున్నారు. ఇప్పుడు సీట్ల అంశం ఈ రెండు పార్టీల కలయిక లో కీలకంగా మారుతోంది. రెండు పార్టీలు అధినాయకత్వం పొత్తు కోరుకుంటున్నా..సీట్ల విషయంలో మాత్రం తేల్చుకోలేకపోతున్నాయి. దీంతో.. ఇప్పుడు దీనిని ముందుగా కొలిక్కే తెచ్చే ప్రయత్నాలు అంతర్గతంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..త్వరలోనే ఈ రెండు పార్టీల పొత్తు అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.