టీడీపీ-జనసేన పొత్తు వల్ల నష్టపోయే ఉత్తరాంధ్ర మంత్రులు?
వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మధ్య హోరాహోరీ పోరు తప్పదని స్పష్టమవుతోంది. ఇటువంటి తరుణంలో ప్రతి ఓటూ కీలకంగా మారుతోంది. ఈ రెండు పార్టీల అధికారానికి వారధిగా జనసేన నిలబడింది. జనసేన ఎవరివైపు మొగ్గుచూపితే వారికి అధికారం ఖాయమనే అంచనాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ఏ ఓటు అయినా జనసేన మీదగా టీడీపీకికానీ, వైసీపీకికానీ వెళ్లాల్సి ఉంటుంది.

ఉత్తరాంధ్రపై పట్టుకోసం జగన్, పవన్
రాష్ట్ర ప్రభుత్వంతో ఎదురైన వివిధ సందర్భాలు పవన్ లో కసిని పెంచినట్లు అర్థమవుతోంది. గతంలోలా తప్పులు చేయకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా చూడాలనే యోచనలో ఉన్నారు. సినిమాల ద్వారా యువతలో మంచి ఫాలోయింగ్ ఉంది. అభిమానుల ఓట్లను కూడా జనసేనవైపు మళ్లించేలా పవన్ వ్యూహరచన చేస్తున్నారు. విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చేసి ఉత్తరాంధ్రలోనే పట్టు నిరూపించుకోవాలని వైఎస్ జగన్ ప్రయత్నిస్తుండగా, మరోవైపు తనకు ఎక్కువ అభిమానులు, పార్టీ శ్రేణులు ఉన్న ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో తన బలాన్ని చూపించాలని పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నారు.

గత ఎన్నికల్లో ఎన్ని వచ్చాయో పరిశీలిస్తే..
ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నవారి నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో జనసేన చీల్చిన ఓట్లవల్లే నెగ్గి ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రులుగా అధికారం చెలాయిస్తున్నవారున్నారు. ఈ రెండు కలిసినా ఎక్కువ మెజారిటీ సాధించినవారు కూడా ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? టీడీపీకి ఎన్ని వచ్చాయి? జనసేనకు ఎన్ని వచ్చాయి? అనేది పరిశీలిస్తే...

ఈ మంత్రులకు ఇలా..
శ్రీకాకుళం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ధర్మాన ప్రసాదరావుకు 84,084 ఓట్లు పోలవగా తెలుగుదేశం పార్టీకి 78,307, జనసేనకు 7557 ఓట్లు వచ్చాయి. 5,777 మెజారిటీతో గెలుపొందిన ధర్మాన మెజారిటీ జనసేనకు పోలైన ఓట్లకంటే తక్కువ.
అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడ అమర్ నాథ్ కు 73,207 ఓట్లు రాగా టీడీపీకి 65,038 ఓట్లు, జనసేనకు 12,988 ఓట్లు వచ్చాయి. ఈ రెండు పార్టీలు కలిసి పోటీచేస్తే అమర్నాథ్ కన్నా ఎక్కువ మెజారిటీ వస్తోంది.
భీమిలీ నుంచి విజయం సాధించిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావుకు 100629 ఓట్లు రాగా, టీడీపీకి 91,917, జనసేనకు 24,248 ఓట్లు వచ్చాయి. అవంతి ఆధిక్యం 9,917గా ఉంది.

వీరికి ఇలా..
మాడుగులలో బుడి ముత్యాలనాయుడికి మాత్రం ఈ రెండుపార్టీలకన్నా ఎక్కువ మెజారిటీ వచ్చింది. 78,830, 62,438, 3745 వచ్చాయి.
చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకు 89,262 ఓట్లు రాగా, టీడీపీకి, 62,764, జనసేనకు 3659, కాంగ్రెస్ కు 4562, నోటాకు 3353 ఓట్లు పోలయ్యాయి. ఈ మూడు వర్గాలకు చెందిన ఓట్లు కలిపినా ఎక్కువ మెజారిటీయే బొత్సకు వచ్చింది.
పలాసలో సీదిరి అప్పలరాజుకు 76,603, టీడీపీకి 60,356, జనసేనకు 6133 ఓట్లు వచ్చాయి. ఈ రెండు కలిపినా సీదిరికే ఎక్కువ మెజారిటీ వచ్చింది.












Click it and Unblock the Notifications