ఆ అవ్వ మాటలతో చంద్రబాబు ఫుల్ ఖుషీ: ఏం చెప్పిందంటే..
ప్రకాశం: జన చైతన్య యాత్రల తొలిరోజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఖుషీ ఖుషీగా గడిపారు. జనంతో మమేకమయ్యారు. కొప్పోలు దళితవాడలో మంగళవారం యాత్ర ప్రారంభించిన అనంతరం సీఎం కాలినడకన పర్యటించారు. దారిపొడవునా కనిపించిన వారిని చిరునవ్వుతో పలకరించారు. ఈ సందర్భంగా ఉమ అనే వృద్ధురాలితో మాటలు కలిపారు.
'ఏం పెద్దమ్మా పింఛన్ సక్రమంగా అందుతోందా?' అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ 'ప్రతినెల పింఛను వస్తోందయ్యా' అని బదులిచ్చింది. ఆమె మాటలకు సంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు పిల్లలు ఎంతమందని ఆరా తీశారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని, బతుకు తెరువు కోసం వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న వారు.. అప్పుడప్పుడు వచ్చి పోతుంటారని పేర్కొంది.
వారొచ్చినా రాకపోయినా మీ ప్రభుత్వం ఇస్తున్న వెయ్యి రూపాయల పింఛనుతో ఎవరిమీద ఆధారపడకుండా బతుకుతున్నానని చెప్పడంతో చంద్రబాబు ఆనందంతో నవ్వులు చిందించారు.
15సూత్రాల ప్రగతి ప్రణాళిక
టీడీపీ మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. యాత్రలో భాగంగా 15 సూత్రాల ప్రగతి ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి ఏం చేశారని కొందరు అడుగుతున్నారని, తమ మేనిఫెస్టోలోని 90 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. ప్రజల వ్యక్తిగత వికాసం కోసం చేపట్టిన 15 సూత్రాల కార్యక్రమం అన్ని గ్రామాల్లో అమలు కావాలని అన్నారు. అవి సాధించే వరకు విశ్రమించొద్దని పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు.
2029 నాటికి సంతోషాంధ్రప్రదేశ్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు చంద్రబాబు వివరించారు. కాంగ్రెస్ పార్టీ నీచ రాజకీయాల వల్లే రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓ దివాళాకోరు పార్టీ అని, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా తాను పనిచేస్తున్నానని, ప్రజలు టీడీపీకి అండగా నిలవాలని కోరారు.
15 సూత్రాలు
పింఛన్లు, ఆహార భద్రత, చంద్రన్న బీమా, అందరికీ నాణ్యమైన విద్యుత్, జూన్ నాటికి అన్ని ఇళ్లకూ గ్యాస్, ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం, ఆరోగ్య భద్రత, అందరికీ విద్య, నీటి భద్రత, ఇంటి భద్రత, 50 శాతం సబ్సిడీతో ఇంటి వద్దకే పశుగ్రాసం, పనిచేస్తామన్న ప్రతి ఒక్కరికీ ఉపాధి కల్పన, వైజ్ఞానిక సమాజంగా రాష్ట్రం, వ్యక్తిగత భద్రత, ప్రతి కుటుంబానికి నెలకు రూ.10వేల ఆదాయం వచ్చేలా చర్యలు ఈ 15 సూత్రాలు ప్రగతి ప్రణాళికలో ఉన్నాయి.