Jagan Killed AP: టీడీపీ సరికొత్త స్లోగన్: ఉన్మాది కొడుకులా ఆస్తులను తెగనమ్ముతున్న జగన్
అమరావతి: ఊహించినట్టే.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై రాజకీయ ప్రత్యర్థుల మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శనాస్త్రాలు ఏకధాటిగా కురుస్తున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన ప్రభుత్వంపై విరుచుకుపడే తెలుగుదేశం పార్టీకి భూముల అమ్మకం రూపంలో మరో బ్రహ్మాస్త్రం చిక్కినట్టయింది. విశాఖపట్నం, గుంటూరుల్లో తొమ్మిది ప్రాంతాల్లో ప్రభుత్వం భూములను విక్రయించానికి జారీ చేసిన సర్కులర్ను కేంద్రబిందువుగా చేసుకుని వైఎస్ జగన్పై చెలరేగిపోతున్నారు టీడీపీ నాయకులు.
గోల్కొండ పరిసరాల్లో వింత జంతువు: హైదరాబాద్ నడిరోడ్డు మీద చిరుత: గాయాలతో కదల్లేని స్థితిలో
జగన్ కిల్డ్ ఏపీ పేరుతో..
జగన్ కిల్డ్ ఏపీ పేరుతో సరికొత్త రణ నినాదాన్ని అందుకుంది తెలుగుదేశం పార్టీ. తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని నిర్మించామని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని ధ్వంసం చేస్తోందని ఆరోపిస్తోంది. రాష్ట్ర పరిపాలనా రాజధానిగా మారడానికి సిద్ధమౌతోన్న విశాఖపట్నంలో భూములను అమ్మాకానికి ఉంచడం తెలుగదేశం పార్టీ ఆరోపణలకుక మరింత పదును పెడుతోంది. విశాఖలో ప్రభుత్వం భూముల దోపిడీకి పాల్పడుతోందని, ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో నిధులను దుర్వినియోగం చేస్తోందంటూ విమర్శలు తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు.
ఉన్మాది కొడుకులా జగన్..
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. వైఎస్ జగన్ను టార్గెట్ చేశారు. ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగారు. జగన్ను ఉన్మాది కుమారుడిగా సంబోధించారు. ఉన్మాది కొడుకులా మారిన ముఖ్యమంత్రి.. ఆస్తులను తెగనమ్ముకుంటున్నారని, రాష్ట్రాన్ని చంపేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఒకవంక రాష్ట్రం గొంతు కోస్తూ.. దానికి మిషన్ బిల్డ్ ఏపీ అని పేరు పెట్టారని ధ్వజమెత్తారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన ట్వీట్ చేశారు. జగన్ వైఖరి తల్లిదండ్రులను గొంతు కోసి చంపిన ఉన్మాది కొడుకు వారికి పెద్ద గుడి కట్టిస్తానని ప్రకటించినట్లుగా ఉందని చురకలు అంటించారు.
తాము ఆస్తులను కూడబెట్టామంటూ..
తమ అయిదేళ్ల ప్రభుత్వ హయాంలో ఆస్తులను కూడబెట్టామని, పెద్ద ఎత్తున సంపదను సృష్టించామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీమంత్రులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత ఏర్పడి సంక్షోభ సమయాన్ని అవకాశంగా మార్చుకున్ని రాష్ట్రాన్ని పునర్నించామని అంటున్నారు. తమ హయాంలో రాష్ట్రంలోో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల, సంక్షేమ పథకాలను అమలు చేశామని, జగన్ ప్రభుత్వం దాన్ని తుంగలోకి తొక్కిందని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూములను అమ్ముకోవడాన్ని తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు.
సంపదను సృష్టించడం చేతకాకపోవడం వల్లే..
సంపదను సృష్టించడం జగన్ సర్కార్ చేత కావట్లేదని మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. విశాఖపట్నంలో ఇప్పటికే వేలాది ఎకరాల భూములను వైసీపీ నాయకులు దోచుకున్నారని ఆరోపించారు. తాము దోచుకున్న వేలాది ఎకరాల భూములకు రేట్లురావడం కోసం, ప్రజల ఆస్తులైన ప్రభుత్వ భూములను తెగనమ్ముతున్నారని విమర్శించారు. ఆ అధికారాన్ని ఎవరిచ్చారని నిలదీశారు. కోట్లుపెట్టి తెచ్చుకున్న సలహాదారులు ఇలాంటి చచ్చు సలహాలు ఇస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. దీనిపై తాము పోరాటం చేస్తామని అన్నారు.