పాకిస్తాన్ వీధులకు తిరిగి హిందూ, సిక్కు పేర్లు..! షాకింగ్ రీజన్..!
స్వాతంత్రం తర్వాత 80 ఏళ్లుగా ఇస్లామిక్ దేశంగా కొనసాగడమే కాకుండా, అంతకు ముందు దేశ విభజన సమయంలో ఉన్న వారసత్వ కట్టడాలు, పేర్లను మార్చేసిన పాకిస్తాన్ (Pakistan).. ఇప్పుడు బిగ్ యూటర్న్ తీసుకుంది. ఎనిమిది దశాబ్దాల తర్వాత ఇప్పుడు ఉన్నట్లుండి లాహోర్ లోని పలు వీధులకు ముస్లిం పేర్లు తీసేసి హిందూ, సిక్క, జైనుల పేర్లు పెడుతోంది. ఇవన్నీ స్వాతంత్రానికి, దేశ విభజనకు పూర్వం ఆయా వీధులకు, ప్రాంతాలకు ఉన్న పేర్లే. అయితే వీటి మార్పు వెనుక కారణాలపై చర్జ జరుగుతోంది.
తాజాగా లాహోర్ లోని ఇస్లాంపురా అధికారిక సైన్బోర్డులపై 'కృష్ణ నగర్' అని, బాబ్రీ మసీదు చౌక్ తిరిగి 'జైన్ మందిర్ చౌక్'గా, రెహమాన్ గల్లీ మళ్ళీ 'రామ్ గల్లీ'గా పేరు మార్చారు. గత రెండు నెలల్లో కనీసం తొమ్మిది ప్రదేశాల పేర్లు ఇప్పటికే మార్చేశారు. అలాగే మరెన్నో పేర్లు తమ 'పాత వైభవాన్ని' తిరిగి పొందడానికి సిద్ధంగా ఉన్నాయి. సన్నత్ నగర్ కాస్తా సంత్ నగర్ గానూ, మౌలానా జాఫర్ అలీ ఖాన్ ఛౌక్ కాస్తా లక్ష్మీ ఛౌక్ గానూ, ముస్తఫాబాద్ కాస్తా ధరంపురగా, సర్ అగా ఖాన్ ఛౌక్ కాస్తా డేవిస్ రోడ్ గా, అల్లామా ఇక్బాల్ రోడ్ కాస్తా జైల్ రోడ్ గా మారిపోయాయి.

అలాగే ఫాతిమా జిన్నా రోడ్ కాస్తా క్వీన్స్ రోడ్ గానూ, బాగ్-ఎ-జిన్నా కాస్తా లారెన్స్ గార్డెన్స్, ఇస్లాంపురా -కాస్తా కృష్ణ నగర్ గా, హమీద్ నిజామి రోడ్ కాస్తా టెంపుల్ స్ట్రీట్ గా, నిష్తర్ రోడ్ కాస్తా బ్రాండ్రెత్ రోడ్ గా, గాజియాబాద్ కాస్తా కుంహర్పురా గా, జీలానీ రోడ్ కాస్తా ఔట్ఫాల్ రోడ్ గా, షాహరా-ఇ-అబ్దుల్ హమీద్ బిన్ బదీస్ కాస్తా ఎంప్రెస్ రోడ్ గా పేరు మార్చుకుంటున్నాయి. అయితే ఈ పేర్ల మార్పు వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన 'లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైవల్ ప్రాజెక్ట్లో భాగంగా ఇలా పేర్లు మారుస్తున్నారు. దేశ సాంస్కృతిక రాజధాని లాహోర్కు విభజనకు పూర్వం ఉన్న వారసత్వాన్ని తిరిగి తీసుకురావడమే దీని లక్ష్యం.

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కలల ప్రాజెక్ట్ ఇది, దీని విలువ 50 బిలియన్ రూపాయలు. విభజన తర్వాత పాకిస్తాన్లో మైనారిటీల (ముఖ్యంగా హిందువులు, సిక్కులు) పరిస్థితి ఆందోళనకరంగా మారింది. వారిపై అణచివేత, బలవంతపు మత మార్పిడులు, ఆస్తుల ఆక్రమణ, దేవాలయాల కూల్చివేత వంటి సంఘటనలు తరచుగా జరిగాయి. దశాబ్దాల ఇస్లామీకరణతో రూపుదిద్దుకున్న దేశంలో ఈ పేరు మార్పిడి కార్యక్రమం దాదాపు ఎటువంటి వ్యతిరేకత లేకుండా సాగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పాత పేర్లను పునరుద్ధరించడం ద్వారా, పాకిస్తాన్ తాను "తీవ్రవాద ప్రతిష్టను" వదులుకొని, సహనశీల, సమ్మిళిత, బహుళ సాంస్కృతిక దేశంగా మారుతోందని అంతర్జాతీయ సమాజానికి, ముఖ్యంగా పశ్చిమ దేశాలకు చాటిచెప్పాలని కోరుకుంటోంది. తద్వారా దౌత్య, ఆర్థిక సహాయాన్ని సులభతరం చేయడమే దీని లక్ష్యం.












Click it and Unblock the Notifications