కూతురికి తెలియకుండా తండ్రి ఆస్తి అమ్మేస్తే.. కోర్టుకు వెళ్లొచ్చా?
తండ్రి సంపాదించిన ఆస్తిపై పిల్లలకు పూర్తి హక్కులు ఉంటాయా? కుమార్తెలు కూడా సమాన వాటా అడగవచ్చా? ఈ ప్రశ్నలకు చాలా మంది అవుననే సమాధానం చెబుతారు. అయితే, చట్టంలో దీనికి సంబంధించి కొన్ని కీలకమైన మెలికలు ఉన్నాయి. ముఖ్యంగా 'స్వార్జిత ఆస్తి' (తండ్రి స్వయంగా సంపాదించిన ఆస్తి) విషయంలో తండ్రి నిర్ణయమే ఫైనల్. ఆయన బతికుండగా ఆ ఆస్తిని ఏం చేసినా ప్రశ్నించే హక్కు వారసులకు ఉండదు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఈ విషయాన్ని మరోసారి స్పష్టం చేస్తోంది.
ఒడిశాలోని భువనేశ్వర్కు చెందిన ఓ మహిళకు ఆలస్యంగా తెలిసిన ఒక నిజం తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆమె తండ్రికి భువనేశ్వర్లో ఒక సొంత స్థలం ఉండేది. అది ఆయన స్వయంగా కొనుగోలు చేసిన స్వార్జిత ఆస్తి. అయితే, 2005లో ఆ తండ్రి తన కుమార్తెకు చెప్పకుండానే, ఆ భూమిని ఆమె ఇద్దరు తమ్ముళ్లకు రాసి ఇచ్చాడు. ఆ తమ్ముళ్లు కూడా అక్కడ ఇళ్లు నిర్మించుకుని హాయిగా నివసిస్తున్నారు.

పదేళ్ల తర్వాత తెలిసిన నిజం
ఆ తర్వాత 2015లో తండ్రి మరణించారు. అయితే, ఆ భూమిని తండ్రి తన తమ్ముళ్లకే రాసిన విషయం సదరు మహిళకు ఇటీవల మాత్రమే తెలిసింది. దీంతో ఆమె ఆశ్చర్యానికి గురైంది. ఆడపిల్లగా ఆ ఆస్తిలో తనకు కూడా హక్కు ఉంటుందని భావించిన ఆమె, ఇప్పుడు ఆ ఆస్తిని సవాలు చేయవచ్చా? తనకు న్యాయంగా రావాల్సిన వాటాను క్లెయిమ్ చేయవచ్చా? అంటూ చట్టపరమైన నిపుణులను ఆశ్రయించింది.
చట్టం ఏం చెబుతోంది? నిపుణుల స్పష్టీకరణ
ఈ విషయంపై చట్టపరమైన నిపుణులు స్పష్టమైన వివరణ ఇచ్చారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారం.. ఒక వ్యక్తి తన స్వార్జిత ఆస్తిపై పూర్తి అధికారాలను కలిగి ఉంటాడు. తండ్రి బతికున్నంత కాలం ఆ ఆస్తిని ఎవరికైనా అమ్ముకోవచ్చు, బహుమతిగా ఇవ్వచ్చు లేదా నచ్చిన వారి పేరు మీద వీలునామా రాయవచ్చు. దీనిని ప్రశ్నించే హక్కు కొడుకులకు గానీ, కూతుళ్లకు గానీ ఉండదు.
ఒకవేళ తండ్రి ఎటువంటి వీలునామా రాయకుండా, ఆస్తిని ఎవరికీ విక్రయించకుండా అకస్మాత్తుగా మరణిస్తేనే.. ఆ మిగిలిన ఆస్తిలో చట్టబద్ధమైన వారసులుగా కుమార్తెలు, కుమారులు సమాన వాటాను క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది.
ఆ కుమార్తెకు వాటా దక్కుతుందా?
ప్రస్తుత కేసులో ఆ భూమి తండ్రి స్వార్జిత ఆస్తి. పైగా ఆయన తన జీవితకాలంలోనే (2005లో) చట్టబద్ధంగా దాన్ని బదిలీ చేశారు. అది తమ్ముళ్లకు ఇచ్చారా లేదా బయటి వ్యక్తులకు అమ్మారా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. తండ్రి బతికుండగానే ఆ లావాదేవీ జరిగిపోయింది కాబట్టి, సదరు మహిళకు ఆ ఆస్తిపై ఎలాంటి న్యాయపరమైన హక్కు (Locus Standi) ఉండదు. ఆ విక్రయ రిజిస్ట్రేషన్ను కోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఆమెకు లేదు.
ఈ ఘటన ద్వారా సామాన్యులు తెలుసుకోవాల్సిన విషయం ఒక్కటే.. తాత ముత్తాతల నుంచి వచ్చే 'పిత్రార్జిత ఆస్తి'లో పుట్టుకతోనే హక్కులు వస్తాయి. కానీ, తండ్రి కష్టపడి సంపాదించిన 'స్వార్జిత ఆస్తి'పై మాత్రం ఆయన బతికుండగా పిల్లలకు ఎలాంటి హక్కులు ఉండవు. తండ్రి తన ఇష్టప్రకారం దాన్ని ఎవరికైనా బదిలీ చేసే పూర్తి స్వేచ్ఛ చట్టం కల్పించింది.















Click it and Unblock the Notifications