గుంతలు పూడ్చడానికే డబ్బులు లేవుగా- మెడికల్ కాలేజీ అంటే నమ్మాలా?- అయ్యన్న
అనకాపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. నర్సీపట్నం నియోజకవర్గం పరిధిలోని జోగినాథుని పాలెంలో బహిరంగ సభలో ప్రసంగించారు. అక్కడే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, మెడికల్ కాలేజీ, తాండవ- ఏలేరు ఎత్తిపోతల పథకం కాలువల అనుసంధాన ప్రాజెక్ట్కు ఆయన శంకుస్థాపన చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలపై ఘాటు విమర్శలు సంధించారు.
ఏపీలో పొత్తుల డైలమా- నేరుగా రంగంలోకి దిగిన అమిత్ షా- చంద్రబాబు అలర్ట్..!!
ఈ సభపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి అయ్యన్న పాత్రుడు విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం దగ్గర రోడ్ల మీద గుంతలు పూడ్చడానికే డబ్బులు లేవని, ఇక మెడికల్ కాలేజీ ఎక్కడి నుంచి కడతాడని ప్రశ్నించారు. ఇన్ని కోట్లు పెట్టి వైద్య కళాశాలను ఎలా కడతావని, ఇది ప్రజలను మోసం చేసినట్లు కాదా? అని ఆయన సూటిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు.
తమ ప్రాంతంలో మెడికల్ కాలేజీ వస్తే గొప్ప విషయమని, దీన్ని తాము స్వాగతిస్తామని అయ్యన్న పాత్రుడు అన్నారు. నిజంగా ప్రభుత్వం మెడికల్ కాలేజీ కడితే మంచిదేనని, తమ భూములకు విలువ పెరుగుతుందని తాను రైతులకు సూచించినట్లు చెప్పారు. డబ్బులు లేకుండా ఎలా కడతారనేదే తన అనుమానమని అయ్యన్న పేర్కొన్నారు. వైద్య కళాశాల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు లేవని, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇలా ఎలా చేయగలుగుతారని చెప్పారు.
వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద మొన్నే అనుమతులు కోరినట్లు మీడియాలో వార్తలు వచ్చాయని గుర్తు చేశారు. అనుమతులు లేకుండా ఇవ్వాళ ఎలా శంకుస్థాపన చేశారని ఆయన నిలదీశారు. ఇంకో ఏడెనిమిది నెలల్లో ఎన్నికలు రాబోతోన్నాయని, అలాంటప్పుడు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయడ ప్రజలను మోసం చేయడానికేనని అయ్యన్న ధ్వజమెత్తారు.
పాడేరులో రెండున్నర సంవత్సరాల కిందట శంకుస్థాపన చేసిన వైద్య కళాశాల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కావట్లేదని, నత్తనడకన సాగుతున్నాయని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. ఇప్పటికే పూర్తయిన వాటికి చెల్లించాల్సిన బిల్లులను కూడా ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని ధ్వజమెత్తారు. ఇలాంటివన్నీ దాచి పెట్టి- ఇప్పుడు నర్సీపట్నంలో వైద్య కళాశాలకు కడతామంటూ శంకుస్థాపన చేయడంలో అర్థం లేదని అన్నారు.