విజయసాయిరెడ్డి ఓ నెల్లూరు పెద్దారెడ్డి- విశాఖ అభివృద్ధి కామెంట్లపై అయన్నపాత్రుడు ఫైర్..
విశాఖపట్నం అభివృద్ధిపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య కొంతకాలంగా వాడీవేడిగా చర్చ సాగుతోంది. విశాఖను అభివృద్ధి చేసింది తామేనని వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్లపై టీడీపీ విరుచుకుపడుతోంది. ఇదే క్రమంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్లకు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
నిన్న నిర్వహించిన వాకథాన్ లాంటి పాదయాత్రలో సాయిరెడ్డి మాటలు వింటే నవ్వోస్తోందని, విశాఖనగరం అందమైన ప్రదేశమని, దాన్ని అభివృద్ధిచేయడానికి తమ ప్రభుత్వం అన్నివిధాల కృషి చేస్తోందని ఆయన చెప్పడం చూస్తుంటే, ఇదివరకు ఒక సినిమాలో ని నెల్లూరు పెద్దారెడ్డి మేనల్లుడి పాత్రలో బ్రహ్మనందం పలికే డైలాగులు గుర్తుకొస్తున్నాయని అయ్యన్నపాత్రుడు తెలిపారు.
విశాఖనగరాన్ని విజయసాయి అభివృద్ధిచేస్తానంటే అక్కడి ప్రజలు ఎవరూనమ్మరని, ఈ ప్రభుత్వం వచ్చాక విశాఖలో జరిగిన అభివృద్ధేమిటో చెప్పాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు. విశాఖలో విధ్వంసం తప్ప, మరోటి చేయలేదని, వాల్తేర్ క్లబ్, గ్రామసమాజం, బేపార్క్ వంటివాటితో మొదలుపెట్టి, విలువైన భూమలున్నింటిని కబ్జాచేసింది వాస్తవం కాదా అని మాజీమంత్రి ప్రశ్నించారు.
దివంగత సినీనిర్మాత రామానాయుడు విశాఖలో స్టూడియో ఏర్పాటు చేయాలనుకున్నభూమిని కూడా కొట్టేయడానికి ఏ2 సిద్ధమయ్యాడని అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా సింహాద్రి అప్పన్నస్వామి భూములను కూడా మింగేయాలని చూస్తున్నాడన్నారు. విశాఖ బీచ్ రోడ్డులోచంద్రబాబునాయుడు చేసిన పనులు తప్ప, చేసిందేమీ లేదన్నారు. మాన్సాస్ ట్రస్ట్ భూములు, గ్రావెల్ క్వారీలు సహా, న్ని వదలనివారు విశాఖను అభివృద్దిచేస్తున్నామని చెప్పడం దారుణమన్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన గీతం కాలేజీ గోడలు పగులగొట్టి, మీయొక్క విద్వంసాన్ని కొనసాగించలేదా అని అయ్యన్న మండిపడ్డారు.
ఇంతచేసి కూడా ప్రజలను మభ్యపెట్టేలా మాయమాటలు చెప్పడం విజయసాయికే చెల్లిందన్నారు. వైసీపీ ప్రభుత్వం దెబ్బకు, విశాఖకు వచ్చిన కంపెనీలన్నీ భయపడి వేరే ప్రాంతాలకు తరలిపోయాయన్నారు. ఇక రాష్ట్రంలో అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులను ఈ ప్రభుత్వం తీవ్రంగా అన్యాయం చేసింది వాస్తవం కాదా అన్నారు. ఉత్తరాంధ్రకు ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్ లో, ఈ 18నెలల్లో తట్టెడు మట్టి వేసిన దాఖలాలు లేవన్నారు. పనులు చేయకపోగా ప్రాజెక్ట్ ఎత్తుని తగ్గిచడానికి ఈప్రభుత్వం సిద్ధమైందన్నారు. విశాఖకు రైల్వేజోన్ తెస్తామని చెప్పినవారు, ప్రధాని మెడలు వంచుతామని బీరాలుపలికిన వారు, ఇప్పుడు ఢిల్లీలో ఏం గడ్డి పీకుతున్నారో విజయసాయిరెడ్డి సమాధానం చెప్పాలన్నారు.
Recommended Video
ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ అక్కడివారికి దండాలు పెట్టిరావడం తప్పచేసింది శూన్యమన్నారు. ఒంట్లో సిగ్గు, లజ్జ, ఉన్నవారెవరూ ఈ విధంగా విశాఖను అభివృద్ధి చేస్తున్నామని మాట్లాడరని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు. వెనకటికి ఎవరో అన్నట్లు, కన్నతల్లికి భోజనం పెట్టలేనివాడు, పినతల్లికి బంగారుగాజులు చేయిస్తానని చెప్పినట్లుగా విజయసాయి మాటలున్నాయన్నారు. విశాఖనగరవాసులు ఎప్పటికీ కూడా విజయసాయి రెడ్డి లాంటి దోపిడీదారులను, దొంగలనుప్రోత్సహించరనే నిజాన్నిఆయన తెలుసుకుంటే మంచిదన్నారు. పంది ఎంతబలిసినా నంది కాదనే కఠిన నిజాన్ని కూడా ఆయన గ్రహిస్తే మంచిదన్నారు. క్రిమినల్, ఏ2 అయిన విజయసాయిరెడ్డి ఇకనుంచైనా వళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడితే మంచిదని అయ్యన్నపాత్రుడు హితవుపలికారు.