జైలు నుండి బయటకు చింతమనేని: 18 కేసుల్లో బెయిల్: వంశీ మీద టీడీపీ అస్త్రం ఆయనేనా..!
టీడీపీ మాజీ ఎమ్మెల్యే..విప్ గా పని చేసిన చింతమేని ప్రభాకర్ ఎట్టకేలకు జైలు నుండి విడుదలవుతున్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. చింతమనేని మీద మొత్తంగా 18 కేసులు నమోదయ్యాయి. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేగా అప్పుడు ఎమ్మార్వో వనజాక్షి మీద దాడి చేసారంటూ సుదీర్ఘ కాలం ఆయన మీద విమర్శలు వెల్లువెత్తాయి. సెప్టెంబర్ 11న అరెస్ట్ అయిన చింతమేని ఇప్పటికి బయటకు వస్తున్నారు. అయితే ఆయన పైన మరో రెండు పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉన్నట్లుగా సమాచారం. చింతమనేని జైళ్లో ఉన్న సమయంలో ప్రస్తుత టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీ సైతం వెళ్లి కలిసి వచ్చారు. చింతమనేని సైతం దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి కావటంతో..రాజకీయంగా వంశీ పైన టీడీపీ చింతమేనిని ప్రయోగించే అవకాశం కనిపిస్తోంది.
టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు ఇప్పటికే 14 కేసుల్లో బెయిల్ రాగా..శుక్రవారం నాలుగు కేసుల్లో బెయిల్ మంజూరు అయింది. ఈ ఏడాది ఆగస్టు 29న పెదవేగి మండలం పినకడిమికి చెందిన చెరుకు జోసెఫ్ పై దాడి చేసి కులం పేరుతో దూషించారన్న అభియోగంతో పెదపాడు పోలీ్సస్టేషన్లో చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది.

దీంతో సెప్టెంబర్ 11న పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత పీటీ వారెంట్పై మరో 17 కేసుల్లో అరెస్టు చేశారు. అప్పటి నుంచి చింతమనేని ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరో రెండు పీటీ వారెంట్లు పెండింగ్ లో ఉన్నాయని జిల్లా పోలీసులు చెబుతున్నారు. చింతమనేని విడుదల సమయంలో సొంత నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్వాగత ఏర్పాట్లకు అభిమానులు .. అనుచరులు సిద్దమయ్యారు దీనికి పోలీసులు నిరాకరించారు. అయితే, చింతమనేని ఇప్పుడు జైలు నుండి విడుదల అయిన తరువాత తన దూకుడు కొనసాగిస్తారా..లేక ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంటారా అనే చర్చ మొదలైంది.
వంశీ మీద టీడీపీ అస్త్రంగా..
ఇక, టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రస్తుతం టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. వంశీ టీడీపీ అధినేత చంద్రబాబు..లోకేశ్ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. టీడీపీ నేతలు స్పందించినా.. వంశీ కి అదే స్థాయిలో దూకుడుగా సమాధానం ఇచ్చే వారు టీడీపీలో ప్రస్తుతం కనిపించటం లేదు. చింతమనేని జైళ్లో ఉన్న సమయంలో వల్లభనేని వంశీ వెళ్లి కలిసి వచ్చారు. దీంతో.. ఇప్పుడు వంశీ పార్టీకి..చంద్రబాబు..లోకేశ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో చింతమనేని ఆయన వ్యాఖ్యల మీద స్పందిస్తారా లేదా అనేది ఆసక్తి కరమే. ఇదే సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు కొద్ది రోజుల క్రితం మాస్ లీడర్ అయిన చింతమనేని జైలుకు వెళ్లటం ద్వారా..ఇప్పుడు రాష్ట్రంలోనే మాస్ లీడర్ గా మారారని చెప్పుకొచ్చారు. దీంతో..అనేక రోజులు జైలు జీవితం అనుభవించి బయటకు వస్తున్న చింతమనేని తరువాతి అడుగులు ఎలా ఉంటాయనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications