జగన్ సాక్షి గంజాయి మొక్క: సిఎం రమేష్ వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే ఈ పత్రికను స్థాపించినట్లు ఆనాటి ముఖ్యమంత్రి, దిగవంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆ పత్రికను తెలుగుదేశం పార్టీ ఈ ఏడాది జూన్ 12 నుంచి బహిష్కరించినట్లు ఆయన చెప్పారు. తమ పార్టీ బహిష్కరించినప్పటికీ తమ వార్తలు ప్రచురిస్తూ..వారి విలేకరి వస్తే ఈ ప్రశ్నలు అడిగేవారంటూ.. చరిత్రలోనే లేని మురికి విధానాన్ని ప్రవేశ పెట్టారని రమేష్ విమర్శించారు.
'జగన్కోసం' అంటూ బినామీ పేర్లతో పద్దులు పుచ్చుకుని అద్దె కలాలతో కథనాలు రాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నాయకులపై లేనిపోని కట్టు కథలతో అసభ్య ప్రచారానికి శ్రీకారం చుట్టారని ఆయన విమర్శించారు.
ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కొనుగోళ్లకు ఓబీ వ్యానులను వినియోగించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. బినామీల అవినీతి పుత్రిక వైయస్ జగన్ పత్రిక అని ఆయన ఆరోపించారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనే ఏకైక ఎజెండాతో పనిచేస్తున్న ఆ పత్రిక, ఛానల్ జర్నలిజం వ్యవస్థకే తీరని కళంకమని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.