సోమవారం వరకు టైమ్ ఇస్తున్నా: జేసీ అల్టిమేటం
JC Prabhakar Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో చెలరేగిన ఇసుక వివాదం చిలికి చిలికి గాలీవానగా మారుతున్నట్టే కనిపిస్తోంది.
రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఇసుకను దోపిడీ చేస్తోన్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. ట్రాక్టర్లు, లారీల డ్రైవర్లు, యజమానుల నుంచి కమీషన్లను దండుకుంటోన్నారంటూ ఆరోపణలు రోజురోజుకూ వెల్లువెత్తుతోన్నాయి. ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనం మండిపడుతున్నారు.

ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తెరమీదికి వచ్చారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఇసుక విషయంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను ఒప్పుకోనేది లేదని తేల్చి చెప్పారు.
తన దగ్గర లిస్ట్ అంతా ఉందని, ఇందులో 40 పేర్లు ఉన్నాయని, సోమవారం వరకు దాన్ని పంపించమంటే పంపిస్తానని అన్నారు. ఎన్నికల్లో పని చేసినందుకు తమకు రేషన్ స్టోర్లు, సారాయి దుకాణాలను ఇస్తే చాలని అనుకుంటున్నారా? అని కొందరు చెబుతున్నారని, ఇది అభ్యంతరకరమని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. అలాంటి వాళ్లకు నది మొత్తం ఇచ్చేయాలా? అంటూ ప్రశ్నించారు.
ఇసుకను ఇష్టానుసారంగా తరలిస్తోన్నారని, అలాంటి వాళ్ల టిప్పర్లు, ట్రాక్టర్లు పట్టుకుని పోతే సంవత్సరం పాటు అవి బయటికి రావని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఇసుకను తరలించడానికి టిప్పర్లు, ట్రాక్టర్లను అద్దెకు ఇవ్వొద్దని, ఇస్తే నష్టపోతారని వాటి యజమానులకు సూచించారాయన.
ఇసుక విషయంలో మాత్రం తాను ఎలాంటి జోక్యం చేసుకోలేనని జేసీ ప్రభాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. తన అనుచరులు, తనకోసం ప్రాణాలను ఇచ్చిన వాళ్లయినా సరే ఈ విషయంలో మాత్రం తనను వదిలేయాలని దండం పెట్టి విజ్ఞప్తి చేశారు. అలాగని తాను వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోనని, ఏదో ఒక రకంగా ఆదుకుంటానని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications