మాటతప్పిన 'బాబు': 'పులిహోరలో కరివేపాకులా వాడుకొని పక్కన పడేశారు'
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు అవసరమైనప్పుడు మనుషులను వాడుకొని, అవసరం తీరగానే పులిహోరలో కరివేపాకులా తీసి పక్కన పడేస్తారనే అపకీర్తి మూటగట్టుకొన్నారనేది అందరికీ తెలిసిందే. అయితే ప్రతిపక్షాలు లేదా పార్టీని వీడిన వారో ఆ ముక్క చెపితే దానికి అంత ప్రాధాన్యత ఉండదు కానీ పార్టీ కోసం కోట్లు తగలేసుకుని జండా మోసిన నాయకులే చెబితే నిజమని నమ్మక తప్పదు.
చెప్పడమే కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుని నిరసిస్తూ ఆమరణ నిరాహార దీక్ష కూడా మొదలుపెట్టడం విచిత్రంగానే ఉంది. డిప్యూటీ సీఎం చినరాజప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో దగాపడ్డ తెలుగు తమ్ముడు తిరుగుబాటు జెండా ఎగరేయడం పార్టీలో తీవ్ర కలకలం రేపింది.
ఒకప్పుడు ఈ నియోజకవర్గంలో ముఖ్యనేతగా చెలామణీ అయిన ముత్యాల రాజబ్బాయి తన సొంత గ్రామమైన ఆర్బీ పట్నంలో చంద్రబాబు ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు గాను ఇంటి వద్దనే నిరాహార దీక్షకు దిగారు.

అసలేం జరిగింది?
2014 ఎన్నికలలో రాజబ్బాయి పెద్దాపురం నియోజకవర్గం నుంచి టిక్కెట్ని ఆశించారు. చంద్రబాబు సహా జిల్లా ముఖ్యనేతలు నిమ్మకాయల చినరాజప్ప, యనమల రామకృష్ణుడు వంటి వారు సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ టిక్కెట్టు ఇస్తుందని రాజబ్బాయిని నమ్మించారు.
చివరి నిమిషంలో స్థానికేతరుడైన చినరాజప్పను పెద్దాపురం నుంచి పోటీపెడుతున్నాం, కలిసి పనిచేసి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎమ్మెల్సీ సీటు ఇస్తామని నమ్మించారని రాజబ్బాయిని బుజ్జగించారు. ఆ తర్వాత చంద్రబాబు సిఎం అయ్యారు. మాట ఇచ్చిన చినరాజప్ప, యనమల ఉపముఖ్యమంత్రి, మంత్రులై పోయారు.
కానీ ఆ తరువాత రాజబ్బాయి ఎన్నిసార్లు గుర్తు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు తనను పులిహోరలో కరివేపాకులా వాడుకొని పక్కన పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. పార్టీలో కొత్తగా చేరిన వారికి మంత్రి పదవులు, రాజ్యసభ సీట్లు ఇస్తున్నారు కానీ కష్టకాలంలో కూడా పార్టీని అంటిపెట్టుకొని ఉండి, పార్టీ కోసం పనిచేసిన తనవంటి సీనియర్లని చంద్రబాబు పట్టించుకోవడంలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారు.
మరోవైపు పార్టీని వీడిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు వర్గీయులు తిరిగి సైకిల్ ఎక్కి తమపై పెత్తనం చెలాయిస్తున్నారని రాజబ్బాయి వర్గం మండిపడుతోంది. ఇచ్చిన మాటకు కట్టుబడి అప్పుడు పోటీ నుంచి విరమించుకుంటే ఇస్తామన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోగా బ్యానర్లు, పోస్టర్లకే పరిమితమయ్యే నాయకులకు వత్తాసు పలుకుతున్నారని రాజబ్బాయి అనుచరులు మండిపడుతున్నారు.
రాజబ్బాయి ఆమరణదీక్షకు దిగడం చంద్రబాబు అనుసరిస్తోన్న వైఖరిని స్పష్టం చేస్తోందని కార్యకర్తలు మండిపడుతున్నారు. బుధవారం చంద్రబాబు నాయుడు తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు రాబోతున్నారు కాబట్టి తన సమస్యకు ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు ఇదే సమయమని భావించే దీక్షకు కూర్చున్నట్టు సమాచారం.
ప్రస్తుతం ముత్యాల రాజబ్బాయి మార్కెట్కమిటీ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆ పదవికి గౌరవం కూడా ఇవ్వకుండా ప్రోటోకాల్ పాటించడం లేదని రాజబ్బాయి వర్గం ఏపీ హోం మంత్రి చినరాజప్పపై నిప్పులు చెరుగుతోంది. కష్టపడ్డ వారికి పార్టీలో గుర్తింపు, పదవులు లభించడం లేదని రాజబ్బాయి అనుచరులు మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications