పెగాసస్ సభా సంఘంపై నారా లోకేష్ రియాక్షన్: ఆ అలవాటు మాకెవ్వరికీ లేదు
అమరావతి: పెగాసస్పై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ చేసిన ప్రకటనలు.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలను సృష్టిస్తోన్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.. తన ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలకు పెగాసస్ను కొనుగోలు చేశారంటూ ఆమె చేసిన ప్రకటనలతో తెలుగుదేశం పార్టీ పూర్తిగా రక్షణాత్మక ధోరణిలో పడిపోయింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎదురుదాడికి దిగుతోందే తప్ప.. మమత బెనర్జీ చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరాన్ని వ్యక్తం చేయట్లేదు.
పవన్ కల్యాణ్..ఓ పరాన్న జీవి: బీజేపీలో విలీనం బెటర్: పొత్తులపై తులసీరెడ్డి
నారా లోకేష్ రియాక్షన్..
ఈ వ్యవహారం మొత్తంపైనా విచారణ చేపట్టటానికి సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఏపీ అసెంబ్లీ నిర్ణయించింది. దీనికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎలాంటి విచారణకైనా తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
పెగాసెస్పై హౌస్ కమిటీ మాత్రమే కాదని.. ఎలాంటి విచారణ జరిపించినా ఎదుర్కొంటామని అన్నారు. జ్యూడిషియరీ కమిటీ గానీ, సీబీఐ విచారణ గానీ.. దేనికి ఆదేశించినా సిద్ధమేనని చెప్పారు.
వైఎస్ వివేకా హత్యపైనా..
వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతం, నాటుసారా మరణాల విషయంలోనూ విచారణ కమిటీలను వేయగలరా..? అని నారా లోకేష్ ప్రశ్నించారు. పెగాసస్ ద్వారా ఫోన్లు హ్యాక్ చేసి.. ఒకరి వ్యక్తిగత విషయాలు వినే అలవాటు తమకు లేదని అన్నారు. ఈ అలవాటు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు ఉందేమోనని ఎద్దేవా చేశారు. అందుకే ఆయన రాసలీలలు బయటపడ్డాయంటూ విమర్శించారు. అయిదు రోజులుగా తాము కల్తీ సారా మరణాలపై పోరాడుతున్నామని..అయినా ప్రభుత్వం స్పందించట్లేదని విమర్శించారు.
42 మంది మరణం..
పెగాసస్ అంశంపై మాత్రం ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, సభా సంఘం వేయడానికి అంగీకరించిందని వ్యాఖ్యానించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కల్తీ సారా వల్ల మొత్తంగా 42 మంది చనిపోయారని నారా లోకేష్ చెప్పారు. ఏపీ ప్రభుత్వం సరఫరా చేసే మద్యం బ్రాండ్లు మనుషులు తాగడానికి పనికి రావని, విషపూరితమైనవని ఆరోపించారు. నాటుసారాతో ప్రభుత్వం పేద ప్రజలను చంపేస్తోందని ఘాటుగా విమర్శించారు. ప్రజల ప్రాణాలకంటే మరేదైనా పెద్ద సమస్య ఉందా అని నిలదీశారు.
గౌతమ్ సవాంగ్ కూడా
పెగాసస్ గురించి మమతా బెనర్జీ అసెంబ్లీలో మాట్లాడారా..? లేక బయట ఈ వ్యాఖ్యలు చేశారా.? అనే విషయంపై స్పష్టత లేదని నారా లోకేష్ అన్నారు. ఆమె బెంగాలీలో మాట్లాడిన వీడియోలో పెగాసెస్ ప్రస్తావన లేదని చెప్పారు. బెంగాలీ తెలిసిన తన స్నేహితుడు ఈ విషయం చెప్పాడని నారా లోకేష్ అన్నారు. పెగాసెస్ సాఫ్ట్ వేర్ కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్- సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసుకున్న ఆర్టీఐ కార్యకర్తకు బదులు ఇచ్చారని గుర్తు చేశారు.
టీడీపీ అంటే భయం..
వ్యక్తులకు.. ప్రైవేట్ సంస్ధలకు పెగాసెస్ సాఫ్ట్వేర్ను తాము విక్రయించలేదని ఇజ్రాయెల్ అంబాసిడర్ సైతం ప్రకటించారని నారా లోకేష్ అన్నారు. ఇవన్నీ పట్టించుకోకుండా పెగాసస్పై సభా సంఘం వేయడంలో అర్థం లేదని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం- టీడీపీ అంటే భయపడుతోందనేది అర్థమౌతోందని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు, విచారణలు, కమిటీలు వేసినా దాన్ని ఎదుర్కొంటామని, నాటుసారా మరణాలపై పోరాటం సాగిస్తామని ఆయన తేల్చి చెప్పారు.