పాలవాడి కంటే ముందే మద్యం: లిక్కర్ను బ్యాన్ చేస్తామంటిరి కదా..ఈ యవ్వారమేందీ: నారా లోకేష్
అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి జగన్ సర్కార్ పాక్షిక లాక్డౌన్ను చేపట్టింది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకే దుకాణాలను తెరచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. 12 గంటల తరువాత ఆర్టీసీ బస్సులు కూడా అందుబాటులో ఉండట్లేదు. దూర ప్రాంతాల మధ్య బస్సు సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. వివాహాలు, శుభకార్యాలు, వేడుకలపై కరోనా ఆంక్షలను విధించింది ప్రభుత్వం.
ఇప్పటికే నిర్ణయించిన పెళ్లిళ్లను నిర్వహించుకోవడానికి స్థానిక అధికారుల అనుమతి తప్పనిసరి చేసింది. వివాహాలు, ఇతర శుభకార్యాలకు 20 మందికి మించవద్దని ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా రోజంతా 144 సెక్షన్ అమలులో ఉంటుంది. కరోనా ఆంక్షలను కఠినంగా అమలు చేయాల్సి ఉంటుందంటూ ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లకు ఆదేశాలను జారీ చేసింది. అదే సమయంలో బ్యాంకులు పూర్తిస్థాయిలో కార్యకలాపాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది.
టెలికామ్, ఇంటర్నెట్, బ్రాడ్కాస్టింగ్, ఐటీ సేవలను మినహాయింపు ఇచ్చింది. పెట్రోల్ బంకులు, ఎల్పీజీ, సీఎన్జీ, గ్యాస్ అవుట్లెట్లు, ట్రాన్స్కో, జెన్కో, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, గిడ్డంగులు, సెక్యూరిటీ సేవలను కర్ఫ్యూ నుంచి మినహాయించింది. విమానం, రైల్వే ప్రయాణికులు తమ టికెట్లను చూపించడం ద్వారా విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్లకు వెళ్లవచ్చు. పరిశ్రమలు, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను కూడా మినహాయింపు పరిధిలోకి తీసుకొచ్చింది.
Recommended Video
తెల్లవారు జామున 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మద్యం దుకాణాలను తెరచి ఉంచడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీన్ని తెలుగుదేశం పార్టీ తప్పు పడుతోంది. పాల పాకెట్ల కంటే ముందే మద్యం దొరికేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందంటూ ఆ పార్టీ నాయకుడు నారా లోకేష్ ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకం వేళలు మారుస్తూ.. తెల్లారి పాల ప్యాకెట్లు అమ్మే సమయానికి ముందే మద్యం షాపులు తెరిచి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. తన సొంత బ్రాండ్ మందును అమ్ముకోవడానికే ప్రభుత్వ పెద్దలు ప్రాధాన్యత ఇచ్చారని ఆరోపించారు.