టీడీపీ నేత పట్టాభి అరెస్ట్: తలుపు తాళం పగలగొట్టి, భారీ బందోబస్తు మధ్య పోలీస్ స్టేషన్కు తరలింపు
విజయవాడ: తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం మధ్యాహ్నం నుంచి పట్టాభి నివాసం వద్ద వేచివున్న పోలీసులు.. రాత్రి 9 గంటల సమయంలో పట్టాభిని అదుపులోకి తీసుకున్నారు. తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడి పట్టాభిని అరెస్ట్ చేశారు.

తలుపులు పగలగొట్టి బలవంతంగా పట్టాభి అరెస్ట్.. భార్య ఆవేదన
కాలింగ్ బెల్ కొట్టినా పట్టాభి తలుపులు తీయలేదని, అందుకే బలవంతంగా అరెస్ట్ చేయాల్సి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. కాగా, తలుపులు పగలగొట్టి తన భర్తను బలవంతంగా అరెస్ట్ చేశారని పట్టాభి భార్య ఆరోపిస్తున్నారు. తన భర్తకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని ఆమె అన్నారు. పట్టాభి అరెస్టు అనంతరం ఆయన భార్య చందన మీడియాతో మాట్లాడారు. ఎఫ్ఐఆర్ కాపీ చూపెట్టకుండా అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఆయనకు ఎం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు. పట్టాభిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పలేదని తెలిపారు. తలుపులు పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించారని పేర్కొన్నారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని.. దీనిపై కోర్టుకు వెళ్తామని తెలిపారు. తన భర్త ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.. అలాగే తిరిగి రావాలని అన్నారు.

సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు: పలు సెక్షన్ల కింద పట్టాభిపై కేసులు
కాగా, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడంతో విజయవాడ గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పట్టాభిపై కేసు నమోదైంది. ఈ క్రమంలోనే పట్టాభిని భారీ బందోబస్తు మధ్య అరెస్ట్ చేసిన పోలీసులు.. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పట్టాభిపై సెక్షన్ 153ఏ, 505 (2), 505 (ఆర్/డబ్ల్యూ), 120బి కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ తరలించినట్లు సమాచారం.

తనకేం జరిగినా.. సీఎం, డీజీపీలదే బాధ్యతంటూ పట్టాభి వీడియో
ఇది ఇలావుండగా, పోలీసులు కస్టడీలోకి తీసుకున్న తర్వాత తనకు ఏం జరిగినా సీఎం జగన్, డీజీపీ గౌతమ్ సవాంగ్దే బాధ్యత అని టీడీపీ నేత పట్టాభి అరెస్టుకు ముందు ఓ వీడియోలో పేర్కొన్నారు. ప్రస్తుతం తన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నానని వీడియో ద్వారా తెలిపారు. డ్రగ్స్కు వ్యతిరేకంగా టీడీపీ తరపున పోరాడుతున్నందుకే తనపై కక్షగట్టి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Recommended Video
తన ఇంటిపై దాడి చేసి తననే అరెస్ట్ చేస్తారా? అంటూ పట్టాభి
మంగళవారం సాయంత్రం కుటుంబసభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఇంట్లోని ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోకుండా తనను అరెస్ట్ చేయడం ఏ మేరకు సబబో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి ఎంపీ రఘురామకృష్ణరాజుపై దాడి చేసిన విధంగా దాడి చేయాలని పోలీసులు చూస్తున్నారని, ఏం జరిగినా కోర్టులో సమాధానం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. న్యాయస్థానం, రాజ్యాంగంపై తనకు పూర్తి నమ్మకం ఉందని న్యాయబద్ధంగా తన పోరాటం కొనసాగుతుందని పట్టాభి ఆ వీడియోలో పేర్కొన్నారు.
కాగా, మంగళవారం సాయంత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు పట్టాభి నివాసంపై దాడి చేసి వాహనాలు, ఇంట్లోని ఫర్నీచర్ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పట్టాభి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగాయి.
తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడ్డారు. దీంతో టీడీపీ బుధవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది.












Click it and Unblock the Notifications