కులదైవం ముందు ప్రమాణం చేస్తావా? మాజీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి శత్రుచర్ల పల్లవిరాజు సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటినుంచే ఎన్నికల వేడి కొనసాగుతోంది. అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిని మించి ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడంతోపాటుగా సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుతున్నారు. తాజాగా మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణికి టిడిపి నేత శత్రుచర్ల పల్లవి రాజు సవాల్ విసిరారు. కులదైవం ముందు ప్రమాణం చెయ్యటానికి సిద్ధమా అంటూ ప్రశ్నించారు.

పుష్పశ్రీవాణిపై శత్రుచర్ల పల్లవి రాజు ఘాటు వ్యాఖ్యలు
పుష్పశ్రీవాణిపై ఘాటు వ్యాఖ్యలు చేసిన శత్రుచర్ల పల్లవి రాజు, మా నాన్న చంద్రశేఖరరాజు పుణ్యమా అంటూ నువ్వు ఎన్నికల్లో గెలుపొందావు అంటూ పుష్పశ్రీవాణి పై విరుచుకుపడ్డారు. నువ్వు అక్రమంగా సంపాదించిన ఆస్తుల చిట్టా మా దగ్గర ఉందని, అక్రమ ఆస్తులు కూడబెట్టలేదని మన కుల దైవం ముందు ప్రమాణం చేస్తావా అంటూ పుష్ప శ్రీవాణికి సవాల్ విసిరారు. రానున్న ఎన్నికలలో పుష్ప శ్రీవాణి కి తగిన బుద్ధి చెబుదాం ఖబడ్దార్ అంటూ వ్యాఖ్యానించారు పల్లవి రాజు.

సిగ్గు పడు.. పుష్ప శ్రీవాణి.. మండిపడిన టీడీపీ నేత, శ్రీవాణి ఆడపడుచు పల్లవిరాజు
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నువ్వు వెళ్లిన చోట మిమ్మల్ని వ్యతిరేకించిన ప్రజలపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రజల పై తప్పుడు కేసులు పెడుతున్నందుకు పుష్పశ్రీవాణి సిగ్గుపడాలి అంటూ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో కురుపాం ప్రజలు పుష్ప శ్రీవాణిని ఓడించటం ఖాయమంటూ తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే ఏపీ ఉపముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి ఆడపడుచు శత్రుచర్ల పల్లవి రాజు తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

టీడీపీ నేతగా వదిన, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణిని టార్గెట్ చేస్తున్నపల్లవి రాజు
కొద్ది నెలల క్రితం ఆమె గిరిజనుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించి కురుపాం నియోజకవర్గం లో గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం తాను టిడిపిలో చేరుతున్నట్లు ప్రకటించి తెలుగుదేశం పార్టీ బాట పట్టారు. పల్లవి రాజు పుష్ప శ్రీవాణి భర్త వైసిపి అరకు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అయిన పరీక్షిత్ రాజుకు స్వయానా చెల్లెలు. గత ఎన్నికల్లో కూడా ఆమె తెలుగుదేశం పార్టీ నుండి టికెట్ ఆశించి శతవిధాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు టీడీపీ నేతగా స్వయానా వదిన, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణిని టార్గెట్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications