Vangaveeti Radha: వంగవీటి రాధాకు గుండెపోటు..!
టీడీపీ సీనియర్ నేత, కాపు నాయకుడు వంగవీటి రాధాకృష్ణ ఇవాళ తెల్లవారు జామున స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. ఉదయం తన ఇంట్లో ఉండగానే ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలియగానే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్ధితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. రాధాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు తెలియడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఆయన్ను పరామర్శించేందుకు నగరంలో ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రికి తరలి వెళ్తున్నారు.

ఇవాళ తెల్లవారుజామున ఛాతీలో నొప్పిగా ఉన్నట్లు వంగవీటి రాధ కుటుంబ సభ్యులకు చెప్పడంతో ముందు జాగ్రత్త చర్యగా ఆయన్ను ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో రాధాను చేర్చారు. వెంటనే డాక్టర్లు ఆయనకు ప్రాథమిక పరీక్షలు నిర్వహించారు. రాధాకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు నిర్దారించారు. దీంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వంగవీటి రాధాను ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్ లో ఉంచినట్లు తెలుస్తోంది. 48 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచి పరిస్ధితిని బట్టి డిశ్చార్జ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
గత ఎన్నికల్లో టీడీపీ,జనసేన, బీజేపీతో కూడిన కూటమి విజయం వంగవీటి రాధ విస్తృతంగా ప్రచారం చేశారు. అంతకు ముందే ఆయన పెళ్లి కూడా చేసుకున్నారు. కూటమి సర్కార్ నామినేటెడ్ పదవుల్లోనూ ఆయనకు ప్రాధాన్యం కల్పిస్తుందని భావిస్తున్న తరుణంలో ఇలా జరగడంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ప్రమాదం లేదని తెలియడంతో వారంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. రాధ ఆరోగ్యంపై కూటమితో పాటు అన్ని పార్టీల నేతలు ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications