జగన్.. మోదీతో ఏం రహస్యాలు మాట్లాడావ్? అక్రమాస్తుల కేసుల గురించేనా?: వర్ల ఫైర్
ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి మోదీతో జరిగిన భేటీలో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్నారని, వాటిని ప్రజలకు బహిర్గతం చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసిన అంశాలపై సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతూ బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
''పుల్లయ్య యవ్వారం ఎలా ఉందంటే... వెళ్లారు.. వచ్చారు...''అన్న చందంగా జగన్ ఢిల్లీ పర్యటన ఉందని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు. 25 ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి, ప్రత్యేకహోదా తెస్తానన్న జగన్ ఆ హామీని ఎంత వరకు సాధించారో సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తే ప్రజలు క్షమించబోరని వర్ల హెచ్చరించారు. ప్రధానితో భేటీలో సీఎం అజెండా ఏమిటో కూడా ప్రకటించకపోవడంలో ఆంతర్యమేమిటో అర్థంకావడంలేదన్నారు.
విభజన చట్టం ప్రకారం ఏపీకి దక్కాల్సిన హక్కులు, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రైల్వే జోన్, కేంద్ర సంస్థల ఏర్పాటు తదితర సమస్యలెన్నో ఉన్నా.. జగన్ కేంద్రాన్ని నిలదీయడంలేదని, సీబీఐ కేసుల మాఫీ, కోర్టుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు, మండలి రద్దు, మూడు ముక్కలాటలా రాజధానుల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం పొందడానికే ధిల్లీ పర్యటనకు వెళ్లారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెడుతున్నారని వర్ల రామయ్య విమర్శించారు.
లోక్సభ వేదికగా ప్రత్యేక హోదా సాధనపై వైసీపీ ఎంపీలు విఫలమైన నేపధ్యంలో స్వయంగా ప్రధాని మోడీని అడిగి సాధించుకు రాకపోవడమేమిటని వర్ల ప్రశ్నించారు. వైసీపీ ఎంపీలు నిస్సిగ్గుగా లోక్సభకు హాజరావడం మినహా కేంద్రాన్ని అడగకుండా ముఖం చాటేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి స్థాయిలో జగన్ అదే పనిని చేయడాన్ని ఏపీ ప్రజలు ఎవగిస్తున్నారన్నారు. రాజకీయ లబ్ధికి వెరవకుండా గత ఐదేళ్లలో హోదా సాధన కోసం పలు మార్గాల్లో టీడీపీ పోరాడిందని, నిర్భయంగా కేంద్రాన్ని నిలదీసి ప్రజల కోసం ఎంతి త్యాగానికైనా వెనుకాడలేదని గుర్తు చేశారు. సిబీఐ కేసుల మాఫీకి, కోర్టులో హాజరు మినహాయింపుకు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను, ఆకాంక్షలను తాకట్టు పెట్టవద్దని వర్ల రామయ్య రిక్వెస్ట్ చేశారు.