ఏపీ నుంచి కియా వెళ్లి పోయింది - మళ్లీ మొదలు పెట్టిన టీడీపీ..!!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ మరోసారి ఘాటు విమర్శలను సంధించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను టీడీపీ తెరమీదికి తీసుకొచ్చింది. రాష్ట్రాన్ని గతంలో శ్రీలంకతో పోలిక తీసుకొచ్చిందా పార్టీ. ఇప్పుడు మరో రెండు కొత్త దేశాలతో పోల్చడం మొదలు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన కాగ్ నివేదిక ఆధారంగా ఇప్పుడు విమర్శలు మొదలు పెట్టారు.
నైజీరియా, జింబాబ్వేల్లా
వైఎస్ జగన్ మూడేళ్ల ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నైజీరియా, జింబాబ్వేల్లా తయారవుతోందంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రజలపై ఆర్థికభారం తీవ్రమైందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ పడిపోయిందని, జీఎస్డీపీ, తలసరి ఆదాయం సింగిల్ డిజిట్కు దిగజారిందని అన్నారు. మూడున్నర సంవత్సరాల్లో వైఎస్ జగన్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల వరకు అప్పులు చేశారని ఆరోపించారు.
స్తంభించిన అభివృద్ధి..
ప్రజల ఆదాయం పెరగలేదని, అభివృద్ధి ఎక్కడికక్కడే స్తంభించిపోయిందని యనమల అన్నారు. ప్రజల ముక్కు పిండి చేస్తోన్న పన్నుల ఆదాయం ఎటు పోతోందో అర్థం కావట్లేదని, దీనికి సంబంధించిన లెక్కలేవీ ఉండట్లేదని విమర్శించారు. ప్రభుత్వం ఎడా పెడా చేస్తోన్న అప్పులు, వచ్చే ఆదాయానికి సంబంధం లేదని విమర్శించారు. ఇబ్బడి ముబ్బడిగా చేస్తోన్న అప్పుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 50,000 కోట్లకు పైగా వడ్డీలను చెల్లించాల్సి వస్తోందని ధ్వజమెత్తారు.
ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం..
ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం.. రాష్ట్రం అప్పులు జీఎస్డీపీలో 35 శాతాన్ని మించకూడదని, వైసీపీ ప్రభుత్వం ఇదివరకే 44.04 శాతం మేర అప్పులు చేసిందని యనమల మండిపడ్డారు. మూడున్నరేళ్లల్లో తలసరి అప్పు 67,000 రూపాయలకు చేరిందని వివరించారు. అప్పులు చెల్లించడానికే మళ్లీ అప్పులు చేయాల్సి వస్తోందని ధ్వజమెత్తారాయన. రాష్ట్ర ప్రభుత్వం చేస్తోన్న అప్పులపై 15వ ఆర్థిక సంఘం కూడా తప్పుపట్టిందని యనమల అన్నారు.
కియా అనుబంధ సంస్థలు..
ద్రవ్యోల్బణ పరిస్థితులు విపరీతంగా పెరిగాయని, పేదలు మరింత పేదలుగా మారుతున్నారని యనమల చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని, ఆర్థిక అసమానతలు తీవ్రం అయ్యాయని పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రానికి కొత్త పరిశ్రమలేవీ రావట్లేదని ఆరోపించారు. విశాఖలో ఏర్పాటు కావాల్సిన లులు, అదాని డేటా సెంటర్, ప్రకాశం జిల్లా నుంచి ఏసియన్ పల్స్ పేపర్ మిల్, కియా అనుబంధ సంస్థలు సహా ఎన్నో ప్రఖ్యాత కంపెనీలతో దక్కాల్సిన ఉపాధి రాష్ట్ర ప్రజలకు దూరమైందని అన్నారు.
కడప స్టీల్ ప్లాంట్..
కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ విషయంలో మాట తప్పిన ప్రభుత్వం ప్రజలను మోసగించిందని ఆరోపించారు. ఆదాయం పెంచుకోవడం, సంపద సృష్టించుకోవడం ద్వారానే భవిష్యత్కు భరోసా ఉంటుందనే సిద్ధాంతాన్ని ప్రభుత్వం విస్మరించిందని అన్నారు. విశాఖ స్టీల్, గంగవరం పోర్ట్, కాకినాడ పోర్ట్, ఆర్టీసీ స్థలాలు, మార్కెట్లు, ప్రభుత్వ భవనాలు వంటి విలువైన ఆస్తులను వైఎస్ జగన్ సొంత పార్టీ వారికి కట్టబెడుతున్నారని మండిపడ్డారు.