కాకినాడలో ఉద్రిక్తత.. తెలుగుదేశం పార్టీ నేతకు గాయాలు
కాకినాడ ప్రభుత్వాస్పత్రి వద్ద శనివారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం మృతిపై తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన నిజనిర్థారణ బృందం ఆసుపత్రి వద్దకు రాగా, వారిని లోనికి రానివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు తోసుకొని ముందుకు వెళ్లడానికి తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నం చేయగా, వారికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.

తోపులాటలో టీడీపీ నేతకు గాయాలు
వీరిద్దరి మధ్య జరిగిన తోపులాటలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎస్.రాజు గాయపడటంతో ఆసుపత్రి లోనికి తీసుకువెళ్లి వైద్యం అందించారు. తెలుగుదేశం నేతలు ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సుబ్రమణ్యం మృతదేహానికి మాత్రం పోస్టుమార్టం జరగలేదు. అనంతబాబును అరెస్ట్ చేస్తేనే తాము సంతకం చేస్తామని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఖరాఖండిగా చెప్పడంతో పోస్టుమార్టం నిలిచిపోయింది.

సహకరించాలని కోరుతున్న పోలీసులు
పోస్టుమార్టం జరగడానికి సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు సహకరించాలని, ఈ కేసులో తమపై ఎటువంటి ఒత్తిళ్లు లేవని, దర్యాప్తు సాగాలంటే పోస్టుమార్టం జరగాలని పోలీసులు తెలిపారు. అందరూ సహకరించాలని కోరుతున్నామన్నారు.

అజ్ఞాతంలోకి అనంతబాబు
ఎమ్మెల్సీ అనంతబాబు తన ఫోన్ స్విచ్చాఫ్ చేసిన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయనపై ఇంతవరకు పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదని, అటువంటప్పుడు తాము సంతకం ఎలా పెడతామని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. అనంతబాబును అరెస్ట్ చేసేవరకు తాము ఉద్యమిస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఒకవైపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే ముఖ్యమంత్రి లండన్ వెళ్లారని, శాంతి భద్రతలపై ఆయనకు అదుపు లేదంటూ తెలుగుదేశం పార్టీ నేతలు విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications