'సిగ్గు లేకుండా అలా!.. మహిళల కన్నీటిలో టీడీపీ కొట్టుకుపోతుంది'
ఆడవాళ్ల మాన, ప్రాణాలతో చంద్రబాబు సహా ఆయన మంత్రులంతా చెలగాటం ఆడుతున్నారని ఎమ్మెల్యే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు.
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊసరవెళ్లి కన్నా వేగంగా రంగులు మారుస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. ఆడవాళ్ల మాన, ప్రాణాలతో చంద్రబాబు సహా ఆయన మంత్రులంతా చెలగాటం ఆడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇంతా చేస్తూ.. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 175 సీట్లు వస్తాయని సిగ్గు లేకుండా ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారని.. ఇంతకీ టీడీపీ అనేది తెలుగు దేశం పార్టీనా? లేక దొంగల పార్టీనా? అని రోజా ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మహిళల కోసం ఒక్కటంటే ఒక్క కార్యక్రమం చేపట్టలేదని మండిపడ్డారు.
మంత్రి రావెల కిషోర్ బాబు నుంచి తనకు ప్రాణహాని పొంచి ఉందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ షేక్ జానీమూన్ భయాందోళన వ్యక్తం చేసినా.. ఆయన గోడు పట్టించుకోవడం లేదని రోజా ఫైర్ అయ్యారు. మంత్రి రావెలను బర్తరఫ్ చేయాలని టీడీపీ మహిళ నేతలంతా ఇప్పటికైనా డిమాండ్ చేయాలని రోజా సూచించారు.
చిత్తూరు మేయర్ చనిపోయినప్పుడు.. రామలక్ష్మిని రావెల కిషోర్ బాబు వేధించినప్పుడు.. ఆఖరికి ఇప్పుడు గుంటూరు చైర్ పర్సన్ షేక్ జానీమూన్ ను వేధిస్తున్నారని చెబుతున్నా.. టీడీపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని రోజా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాబోయే రోజుల్లో మహిళల కన్నీటిలో టీడీపీ కొట్టుకుపోతుందని రోజా శాపనార్థాలు పెట్టారు.
కొంతమంది టార్చర్ భరించలేక మెడికోలు సైతం చనిపోతున్నారని, నారాయణ కాలేజీలో ఎంతోమంది చనిపోతున్నా.. మంత్రి నారాయణను ఏనాడు ప్రశ్నించడం లేదని రోజా అన్నారు. మంత్రి నారాయణను ఎందుకు బర్తరఫ్ చేయరంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రోజా.