వైఎస్ ఆర్ సీపీ నేతల దుమ్ము లేపిన టీడీపీ లీడర్స్
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రల ప్రజలు నిత్యం చిత్తూరు జిల్లాలోని బోయకొండ గంగమ్మ దేవాలయం దగ్గరకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మూడు రాష్ట్రాల ప్రజలు ప్రతి రోజూ కొన్నివేల మంది బోయకొండ ఆలయాన్ని దర్శించుకుంటారు.
బోయకొండ ఆలయానికి గత పాలకమండిలి చైర్మన్ గా వైఎస్ఆర్ సీపీ నాయకులు రతీదేవి, ఆమె భర్త రమణారెడ్డి రెండు సార్లు పని చేశారు. ఈ సారి చైర్మన్ పదవి తమ వర్గాలకు ఇవ్వాలని బీసీ సంఘాల నాయకులు క్రిష్ణమూర్తి, గంగరాజు ప్రభుత్వానికి మనవి చేశారు.
అయితే ప్రభుత్వం మాత్రం బోయకొండ సమీపంలో ఉన్న చౌడేపల్లికి చెందిన గువ్వల రామకృష్ణారెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించింది. తరువాత దేవాలయం నిర్వహణ, నిధులు దుర్వినియోగం చేస్తున్నారంటూ మాజీ చైర్మన్ రమణారెడ్డి రిట్లు దాఖలు చేశారు.
అంతే కాకుండా బోయకొండ అక్రమాలపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం ఇవ్వాలని రమణారెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య రచ్చ మొదలైయ్యింది. టీడీపీలోని బీసీ సంఘాల నాయకులను రమణారెడ్డి రెచ్చగొడుతున్నారని సొంత పార్టీ నాయకులు కక్ష పెంచుకున్నారు.
శుక్రవారం సాయంత్రం పుంగనూరు పట్టణంలోని కొత్త ఇండ్లు దగ్గర వెలుతున్న బీసీ సంఘం నేతలు క్రిష్ణమూర్తి, గంగరాజు మీద బోయకొండ ఆలయ కమిటి చైర్మన్ కుమారుడు రమేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి దాడి చేశారు.
తరువాత బోయకొండ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ రతీదేవి ఇంటి దగ్గరకు వెళ్లి తలుపులు పగలగొట్టారు. ఇంటిలో ఉన్న ఫర్నిచర్ ధ్వంసం చేసి తనను పురుషపదజాలంతో దూషించారని రతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
టీడీపీ నాయకులు దౌర్జన్యం చేస్తున్న సమయంలో అక్కడికి సాక్షి టీవీ రిపోర్టర్ వసంతకుమార్ వెళ్లి వీడియో చిత్రీకరించడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తన మీద దాడి చేసి కెమెరా ధ్వంసం చేసి తన దగ్గర ఉన్న నగదు, బంగారు చైన్ లాక్కొన్నారని సాక్షి టీవీ రిపోర్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు చేసిన తరువాత వసంత్ కుమార్ పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. సంఘటనా స్థలానికి సబ్ ఇన్స్ పెక్టర్ హరిప్రసాద్ చేరుకుని పరిశీలించారు. బీసీ సంఘాల నాయకులు, రతిదేవి ఫిర్యాదు చెయ్యడంతో రెండు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.