'వ్యూహంతోనే తుని ఘటన, కాపులు తలదించుకునేలా': జగన్ వైపు వేలు
విజయవాడ: తుని ఘటన పైన మంత్రి నారాయణ ఘాటుగా స్పందించారు. మందస్తు వ్యూహంతోనే తుని విధ్వంసం జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నారని ఆయన వైసిపి అధ్యక్షులు జగన్ పైన పరోక్షంగా మండిపడ్డారు.
బీసీలను కాపులలో చేర్చే విషయమై తాము కట్టుబడి ఉన్నామని మంత్రి నారాయణ చెప్పారు. కొందరు కాపు నేతలు కాపులు మొత్తం తలదించుకునేలా చేశారని మండిపడ్డారు. తుని ఘటన పైన టిడిపి నేతలు వైయస్ జగన్ వైపు వేలు చూపిస్తున్న విషయం తెలిసిందే.
తుని అల్లర్లకు కారణం చంద్రబాబే!: విశాఖలో సి.రామచంద్రయ్య ప్రకటన
తునిలో ఆదివారం చోటుచేసుకున్న అల్లర్లకు టిడిపి అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడే కారణమని ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ పక్ష నేత, కాపు సామాజికవర్గానికి చెందిన కీలక నేత సి రామచంద్రయ్య ఆరోపించారు.
ఆయన సోమవారం నాడు విశాఖలో విలేకరులతో మాట్లాడారు. కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని ఎన్నికల నాడు హామీ ఇచ్చిన చంద్రబాబు, గద్దెనెక్కిన తర్వాత ఆ విషయాన్ని పక్కన బెట్టేశారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ఉదాసీన వైఖరి కారణంగానే నిన్నటి కాపు గర్జనలో కాపులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారన్నారు. కాపుల హింసాకాండకు ముమ్మాటికీ చంద్రబాబుదే బాధ్యత వహించాలన్నారు. నిర్ణీత గడువులోగా కాపులను బీసీల్లో చేర్చి ఉంటే నిన్నటి ఘటన చోటుచేసుకునేది కాదన్నారు.