ట్విస్ట్:చింటూ పేరెంట్స్ విషం తాగారా?: చంపేస్తుంటే ఏంచేస్తున్నారు.. మేయర్ భర్త, బాబు ఎదుట కన్నీళ్లు
చిత్తూరు: మేయర్ అనురాధ దంపతుల దారుణ హత్య కేసులో కీలక సూత్రధారిగా భావిస్తున్న చింటూ అలియాస్ చంద్రశేఖర్ తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పోలీసులు మాట్లాడుతున్నారు. మేయర్ అనురాధ, భర్త మోహన్ హత్య కేసులో మోహన్ మోనల్లుడు చింటూ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో మోహన్ తల్లిదండ్రులను పోలీసులు పోలీస్ స్టేషన్కు పిలిపించారు. వారి నుంచి చింటూ ఎక్కడున్నారో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. చిత్తూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో వారిని ఉంచి విచారిస్తున్నారు.
Photos: అనురాధ అంతిమయాత్ర
మరోవైపు, మేయర్ దంపతుల హత్యలో మేనల్లుడు (అక్క కొడుకు) చింటూ పేరు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఆయన కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతని పైన రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉండగా, చింటూ తీరును జీర్ణించుకోలేక అతని తల్లిదండ్రులు ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
తప్పు చేసి ఉండడు: చింటూ పేరెంట్స్
తమ కొడుకు చింటూ ఎలాంటి తప్పు చేసి ఉండడని చింటూ తల్లిదండ్రులు పోలీసుల ఎదుట చెప్పారు. తమ మధ్య (మేయర్ అనురాధ కుటుంబంతో) చంపుకునేంత కక్షలు ఏమీ లేవని వారు చెప్పారు. తమ అబ్బాయి తప్పు చేస్తే చట్టప్రకారం శిక్షను అనుభవిస్తారని చెప్పారు. ఆత్మహత్యా వార్తల నేపథ్యంలో తాము రెండో పట్టణ పోలీసు స్టేషన్లో సురక్షితంగా ఉన్నామని చెప్పారు.
చంపేస్తుంటే ఏం చేస్తున్నారు!
మేయర్ హత్య కేసులో ఎన్నో విషయాలు వెలుగు చూస్తున్నాయి. దుండగుల నుంచి బయటపడేందుకు మేయర్ అనురాధ భర్త మోహన్ ప్రయత్నించారు. దాడి నుంచి తనను, తన భార్యను రక్షించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. చంద్రబాబు వచ్చినప్పుడు మేయర్ దంపతుల అనుచరులు ఆయనకు పూసగుచ్చినట్లు వివరించారు.
చిత్తూరు కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్గా ఉన్న తన భార్య అనురాధతో కలిసి మోహన్ మరికొంతమంది కార్పొరేటర్లతో చర్చల్లో మునిగి ఉన్నారు. ఈ సమయంలో బురఖాలు ధరించి మేయర్ చాంబర్లోకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు దాడికి దిగారు.
ఈ సందర్భంగా మేనల్లుడు చింటూ నేరుగా అనురాధ వద్దకు వెళ్లగా, టేబుల్కు మరోవైపు కూర్చున్న మోహన్ వేగంగానే స్పందించారు. అయితే బురఖాతో వచ్చిన మరో వ్యక్తి కత్తి దూయటంతో దాని నుంచి తప్పించుకుని వారిపై మోహన్ ఎదురుదాడి చేసేలోగానే అనురాధపై కాల్పులు జరిగాయి.
చేతిలో ఆయుధం లేకపోవడం, అనుచర వర్గం బయట ఉండటంతో మోహన్ బయటకు పరుగులు పెట్టే యత్నం చేశారు. అదే సమయంలో చింటూ మేమమామ మోహన్పై దాడి చేశాడు. అయినా మోహన్ బయటకు వెళ్లే యత్నం చేయగా కత్తి చేతబట్టిన వ్యక్తి ఆయనను అడ్డుకున్నాడు.
బయటకు పరుగెత్తిన మోహన్... కుర్చీలను వారి వైపుకు విసిరాడు. బయట ఉన్న మరో ముగ్గురితో కలిసి మొత్తం ఐదుగురు మోహన్ను చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. నిందితులు వెళ్లిపోగానే కిందపడ్డ మోహన్ వద్దకు ఆయన అనుచరులు పరుగెత్తుకుంటూ వచ్చారు.
రక్తపు మడుగులో ఉన్న మోహన్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో... మీ అక్కను, నన్ను చంపేస్తుంటే, ఏం చేస్తున్నార్రా? అంటూ మోహన్ తన అనుచరులతో అన్నారు. ఇవే తమ నేత చివరి మాటలని చంద్రబాబుకు చెబుతూ ఆయన అనుచరులు కన్నీటి పర్యంతమయ్యారు.కాగా, అనురాధ దంపతుల అంత్యక్రియలు గురువారం మధ్యాహ్నం పూర్తయ్యాయి.