500 కోట్లు చేతులు మారాయి!: మంత్రి కొడాలి నానిపై ఎస్పీకి టీడీపీ ఫిర్యాదు
కృష్ణా: జిల్లాలోని గుడివాడలోని కే కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహణకు సంబంధించి మంత్రి కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఎస్పీకి తెలుగుదేశం పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. జూదం, అసభ్య నృత్యాల నిర్వహణ ద్వారా రూ. 500 కోట్లు చేతులు మారాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తూ.. తెలుగు సంస్కృతిని దెబ్బతీసే చర్యలను పోలీసులు ఉపేక్షించడం తగదని టీడీపీ నేతలు హితవు పలికారు. భవిష్యత్తులో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. కాగా, ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎక్కుపెట్టారు.
తెలుగుదేశం పార్టీ హయాంలో పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్గా నిలిచిందని పేర్కొన్న చంద్రబాబు.. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అశ్లీల నృత్యాలు, డ్రగ్స్, కేసినో కల్చర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిందంటూ ఎద్దేవా చేశారు. గుడివాడలో కేసినో నిర్వహించిన మంత్రి అందుకు బాధ్యులైన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి హయాంలో గోవా కేసినో కల్చర్, పేకాట క్లబ్బులు, డ్రగ్స్, గంజాయి పెరిగిపోయాయని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు.
మరోవైపు, కరోనా దృష్ట్యా 12కు పైగా రాష్ట్రాలలో స్కూళ్ళు మూసివేశారని చెప్పిన చంద్రబాబు.. ఏపీలో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టి స్కూళ్ళు పెట్టడం దారుణమని, ఇది దుర్మార్గమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూళ్ళలో తరగతులను తక్షణమే వాయిదా వేయాలని చంద్రబాబు సూచించారు. పాఠశాలల నిర్వహణ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి మూర్ఖంగా వ్యవహరించడం దారుణం అని టిడిపి అధినేత చంద్రబాబు మండిపడ్డారు. వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ధాన్యం కొనుగోలు డబ్బులు వెంటనే చెల్లించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.