‘తాడేపల్లి ఫైల్స్’ పేరుతో సినిమా?
'తాడేపల్లి ఫైల్స్' పేరుతో సినిమా తీయాల్సి వస్తే ఐదారు సీక్వెల్స్ తీయాల్సి ఉంటుందంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. 30ఏళ్లు రాష్ట్రాన్ని పాలిస్తానంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి... ఆయనపై ఉన్న 31 క్రిమినల్ కేసులే అర్హతగా భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. 'జగనాసుర చరిత్ర' అనే అంశంపై టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నిమ్మల రామానాయుడు పాల్గొని విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి జగన్ ను పొగడడానికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ తప్ప మరేమీ లేదని, మైనింగ్ చట్టం ఆయన పాదాల కింద నలిగిపోతోందన్నారు. రాష్ట్రంలోని వివిధ మార్గాలద్వారా జగన్ దోపిడీ రూ.1.20 లక్షల కోట్లని, 13 అంశాల్లో యథేచ్చగా ప్రజాధనాన్ని దోచుకున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు కేవలం భూమిపైనే రూ.40వేల కోట్లు దోచుకున్నారన్నారు. జగనాసుర అవినీతి రక్త చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ప్రజాధనం దోపిడీ చేస్తున్న జగన్.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడన్నారు.

ఇళ్ల స్థలాల కొనుగోళ్లల్లో పేదలకు కలిగిన లాభం గోరంతైతే వైసీపీ నాయకులకు మాత్రం లాభం కొండంత ఉందన్నారు. తన చేతికి మట్టి అంటకుండా ముఖ్యమంత్రి క్రిమినల్ పనులు చేయిస్తున్నారని, ఆయన చేయిస్తున్న క్రిమినల్ పనులకు ప్రత్యక్ష ఉదాహరణ వైఎస్ వివేకానందరెడ్డి హత్యేనని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా తప్పుడు కేసులు పెట్టారని, త్వరలోనే ఎంపీ అవినాష్ రెడ్డి అరస్టయ్యే పరిస్థితులు రాబోతున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలమేంటో ప్రజలు చూపించారని, ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ప్రవర్తించడం మంచిదనే విషయాన్ని జగన్ గ్రహించాలన్నారు.












Click it and Unblock the Notifications