'రోజా కోసం జగన్ జబర్దస్త్ స్కిట్, ఆధారాల్లేని 'సాక్షి' కథనాలు'
విజయవాడ: తెలుగుదేశం పార్టీ నాయకులు... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజాను లక్ష్యంగా చేసుకున్నారు. రోజా సస్పెన్షన్ అంశాన్ని వైయస్ జగన్ రాజకీయం కోసం వాడుకుంటున్నారని టిడిపి నేతలు మండిపడుతున్నారు.
ప్రతి దానికి రోజాను ముందు పెట్టి జగన్ డ్రామాలు ఆడుతున్నారని తెలుగుదేశం ధ్వజమెత్తుతోంది. ప్రతిపక్షం అసెంబ్లీలో ప్రజా సమస్యలపై చర్చించకుండా రోజా కోసం జరబ్దస్త్ స్కిట్లు చేసి సమయాన్ని వృథా చేసిందని ఎద్దేవా చేస్తున్నారు.
వైసిపి సర్కస్ పార్టీలా మారిందని, ఇవన్నీ చూసి వారి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రాజధాని భూముల పైన వైసిపి కరపత్రం సాక్షిలో రాసిన విషపు రాతల పైన సాక్ష్యాధారాలు చూపించమంటే జగన్ తోక ముడిచారని మండుపడుతున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమ పార్టీ రాజధాని వార్తల పైన సవాల్ చేసిందని, దానికి జగన్ అండ్ కో తోక ముడిచిందని, వారి పైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆధారాలు లేనికథనాలను సొంత పత్రికలో ప్రచురించి అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు పట్టుబట్టి సభా సమయాన్ని వృథా చేసిందని పంచుమర్తి అనురాధ, టిడిపి నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ధ్వజమెత్తారు.