రోజాకు, జగన్కు కాల్మనీ బంధం: అనురాధ, భూములపై లింగమనేని వివరణ
విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఇతర మంత్రుల గురించి వైసిపి ఎమ్మెల్యే రోజా మాట్లాడుతున్న భాష సరిగా లేదని మహిళా సాధికారత సంస్థ చైర్మన్ పంచుమర్తి అనురాధ మంగళవారం నాడు మండిపడ్డారు. జగన్కు రోజాకు మధ్య కాల్ మనీ సంబంధముందని ఆమె ఆరోపించారు.
చెక్ బౌన్సు కేసులో చెన్నై కోర్టుల చుట్టూ రోజా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెండ్ చేసినా రోజుకు ఇంకా బుద్ధి రావడం లేదన్నారు.
మంత్రి పీతల సుజాత కూడా రోజాపై ధ్వజమెత్తారు. రోజాకు మహిళల గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. మహిళలకు టిడిపి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు.
భూములపై లింగమనేని వివరణ
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సమీపంలో లింగమనేని ఎస్టేట్స్ అక్రమాలకు పాల్పడిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని లింగమనేని రమేష్ తెలిపారు. ఆ భూములను తాను 2003లో కొనుగోలు చేశానని స్పష్టం చేశారు. దీనిపై దివంగత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కమిటీ వేసిందన్నారు.
అది ఇచ్చిన నివేదికను ఆధారం చేసుకుని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఆ భూములను 2014లో కొనలేదన్నారు. అక్రమార్జనకు పాల్పడేందుకు అధికారంలో లేనని చెప్పారు. వివిధ దేశాల్లో తాను చేసిన వ్యాపారాల ద్వారా సంపాదించిన ఆస్తులతో వ్యాపారం చేస్తున్నానని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని ప్రభుత్వానికి ఇచ్చేశానని చెప్పారు. అది అక్రమమా? లేక సక్రమమా? అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రయోజనం పొందలేదన్నారు. ఈ రాష్ట్రంలో ఎందుకు పెట్టుబడి పెట్టామా? అనే ఆలోచన రానీయొద్దన్నారు. వ్యాపారం చేసుకుంటూ పలువురికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు.