ప్రజల్లోకి వస్తే జగన్కు రాళ్ల దెబ్బలే: మిగిలేది ఓదార్పేనా?
హైదరాబాద్: అవినీతి సొమ్ముతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు విరుచుకుపడ్డారు.
ప్రజల్లోకి వస్తే రాళ్లతో కొడతారనే భయంతో జగన్ గవర్నర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారని, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి టీడీపీలో చేరుతున్న వైసీపీ ఎమ్మెల్యేలను కట్టడి చేసుకోలేక గవర్నర్కు ఫిర్యాదు చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.
వైసీపీ మునిగిపోతున్న పడవ వంటిదని, అందుకే అందులో ప్రయాణిస్తున్నవారు వేరే పడవను ఆశ్రయిస్తున్నారని మంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. జగన తండ్రి వైఎస్ ఎమ్మెల్యేలను భయపెట్టి కాంగ్రెస్లో చేర్చుకున్న విషయం మరచిపోయారా అని ప్రశ్నించారు.

ప్రధాని, రాష్ట్రపతి, గవర్నర్ - ఇలా ఎవరి వద్దకు వెళ్లినా జగన్కు మిగిలేది ఓదార్పేనని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. జగన కుటుంబసభ్యులు టీడీపీలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనంతపురంలో అన్నారు.
జగన్ వల్ల అభివృద్ధి కాదు కదా.. రాజకీయ మనుగడ కూడా ఉండదన్న భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలు టీడీపీలోకి వస్తున్నారన్నారు. తన ఎమ్మెల్యేలను కాపాడుకోవటానికే జగన్ ఉత్తర దేశ విహారయాత్ర చేపట్టారని డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు.
కాగా, జగన్ వెంట ఉన్న ఎమ్మెల్యేలే తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లో పోటీచేసి వారి సత్తా నిరూపించుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ సవాల్ విసిరారు.












Click it and Unblock the Notifications