ఎస్సీ,ఎస్టీలంతా టిడిపితోనే...రాష్ట్రపతిని కలిసిన తెదేపా బృందం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ చట్టంపై విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోవడం సిగ్గుచేటని మంత్రి జవహర్ అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను టీడీపీ బృందం కలిసింది.
అనంతరం మంత్రి జవహర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ చట్టంపై తమ విజ్ఞప్తిపట్ల రాష్ట్రపతి సానుకూలంగా స్పందించారన్నారు. బడుగు, బలహీనవర్గాల రక్షణను ప్రభుత్వాలు తీసుకోవాలని ఆయన కోరారు. మరో ఎస్సీ నేత జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు అందరూ టీడీపీ వెంటే ఉన్నారని అన్నారు.ళితులకు అండగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై సుప్రీంకోర్టు తీర్పు రాజ్యాంగాన్ని, ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసే విధంగా ఉందని...దీనివల్ల ఎస్సీ, ఎస్టీల్లో నెలకొన్న అభద్రత భావాన్ని తొలగించాలనే వినతితో టీడీపీ బృందం సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలిసింది. ఈ బృందంలో ఇంచుమించు టిడిపిలో ఉన్న అందరు ప్రధాన ఎస్సీ, ఎస్టీ నేతలందరూ ఉన్నారు. రాష్ట్రపతిని కలసిన అనంతరం బృందంలోని సభ్యులు మీడియాతో మాట్లాడారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై... వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఎస్టీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీ డిమాండ్ చేశారు. లేదంటే కేంద్రం పెద్దల నివాసాల ముందు ధర్నాలు చేస్తామని ఆయన అన్నారు. ఇదిలావుండగా ఎస్సీ, ఎస్టీల సమస్యలను కేంద్రం పట్టించుకోవడంలేదని టీడీపీ నేత రవీంద్రబాబు ఆరోపించారు. కోర్టులు తీర్పు ఇచ్చే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై కేంద్రానికి చిత్తశుద్ధిలేదన్నారు. రిజర్వేషన్లు, ప్రమోషన్లు సక్రమంగా ఉండేలా చూడాలని రవీంద్రబాబు సూచించారు.