సుచరిత పై టీడీపీ అభ్యర్ధి ఖరారు, కానీ - కీలక పరిణామం..!!
మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత పోటీ ఖాయమైందా. కొంత కాలంగా సుచరిత వైసీపీ నుంచి పోటీ చేయటం పైన సందిగ్ధత కొనసాగుతోంది. టీడీపీలోకి సుచరిత భర్త వెళ్తున్నారంటూ ప్రచారం సాగింది. తాజాగా సుచరిత భర్తకు సీఎం జగన్ నామినేటెడ్ పోస్టు కట్టబెట్టారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈ ఇద్దరిలో పోటీ చేసేదెవరనే చర్చ మోదలైంది. ఈ విషయంపై టీడీపీలో క్లారిటీ వచ్చేసింది. ప్రత్తిపాడు నుంచి పార్టీ తరపున అభ్యర్ధిపై చంద్రబాబు మంతనాలు సాగిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది.
మరోసారి బరిలో సుచరిత : వైసీపీ సీనియర్ నేత మేకతోటి సుచరిత మరోసారి వైసీపీ నుంచి పోటీకి సిద్దమయ్యారు. ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన సమయంలో సుచరిత మనస్థాపానికి గురయ్యారు. ఆ తరువాతి పరిణామాలతో అనేక రకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. కానీ, తాను పార్టీ మారేది లేదని..రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే ఉంటానని స్పష్టం చేసారు.

సుచరిత భర్త టీడీపీ నుంచి బాపట్ల ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి జగన్ ఈ మధ్య కాలంలోనే సుచరిత భర్తకు కీలక పదవి కట్టబెట్టారు. ఇప్పుడు సుచరిత ప్రత్తిపాడు నుంచి పోటీకి లైన్ క్లియర్ అయింది. ఈ సమయంలోనే ప్రత్తిపాడు నుంచి టీడీపీ అభ్యర్ధి పైన చంద్రబాబు నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
సుచరిత పై ఐఏఎస్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్దులను ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ప్రత్తిపాడు లో మేకతోటి సుచిరిత పైన అభ్యర్ధిని దాదాపు ఫైనల్ చేసారు. ప్రత్తిపాడు (ఎస్సీ) స్థానానికి ఇటీవలి వరకూ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రామాంజనేయులు రేసులో ముందున్నారు. ఆయన గతంలో గుంటూరు కలెక్టర్ గా పని చేసారు.
కానీ తాజాగా సమీకరణలు మారినట్లు కనిపిస్తోంది. ఆయన అల్లుడు రాజేశ్ ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెరపైకి వచ్చారు. తాజాగా చంద్రబాబును కలిసి మాట్లాడారు. రామాంజనేయులు కూడా విడిగా అధినేతను కలిశారు. ఈ కుటుంబంలో ఎవరో ఒకరికే అవకాశం వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మామ..అల్లుళ్లలో దక్కేదెవరికి : రాజేశ్ 2009లో చింతలపూడి నుంచి గెలుపొందారు. అసెంబ్లీకి ఎన్నికైన అతి చిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. ప్రత్తిపాడు నుంచి మేకతోటి సుచరిత 2004, 2012 ఉప ఎన్నికల్లో, 2019 లోనూ విజయం సాధించారు. 2014 లో టీడీపీ నుంచి గెలిచిన రావెల కిశోర్ బాబు నాడు చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పని చేసారు. తరువాత జనసేన, బీజేపీ లో చేరారు. బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
తిరిగి టీడీపీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఐఏఎస్ రామాంజనేయులుకు ప్రత్తిపాడు ఇస్తారా.. లేక చింతపూడిలో రాజేశ్ ను బరిలోకి దింపుతారా అనేది చర్చ నడుస్తోంది. ఈ ఇద్దరిలో పార్టీ నాయకత్వం ఎవరిని ఎంచుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల్లో దీనిపై నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications