కోడెల వద్దు మహాప్రభో: సత్తెనపల్లిలో టీడీపీ నాయకుల నిరసన: నరసరావు పేట లోక్ సభకు సాగనంపే డ్రామానా?
గుంటూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు అసమ్మతి సెగ తగులుతోంది. సొంత పార్టీ నాయకులు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. కోడెల శివప్రసాద రావుకు టికెట్ ఇస్తే.. దగ్గరుండి మరీ ఓడిస్తామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. కోడెలకు సీటు ఇవ్వవద్దంటూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగలేదు. సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.
కోడెల శివప్రసాద్ కు నరసరావు పేట లోక్ సభ నుంచి బరిలో దించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనికి ఆయన గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. తాను లోక్ సభకు పోటీ చేసేది లేదని భీష్మిస్తున్నారు. అదే సమయంలో.. కోడెలకు టికెట్ ఇవ్వకూడదంటూ స్థానిక నాయకులు నిరసనలు వ్యక్తం చేయడం వెనుక అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నిరసనల వెనుక పార్టీ పెద్దల హస్తం ఉంటుందనే సందేహాలు ఏర్పడుతున్నాయి.
మూడుసార్లు గెలుపు..రెండుసార్లు ఓటమి
కోడెల శివప్రసాద రావు సొంత నియోజకవర్గం నరసరావు పేట. 1989, 1994, 1999 ఎన్నికల్లో ఆయన వరుసగా నరసరావుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా హ్యాట్రిక్ విజయం సాధించారు. 2004, 2009లో అదే పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీనితో ఆయన నియోజకవర్గాన్ని మార్చివేశారు. పొరుగునే ఉన్న సత్తెనపల్లికి పంపించారు. 2014 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన కోడెల.. అతి తక్కువ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి అంబటి రాంబాబుపై కేవలం 700పై చిలుకు ఓట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకున్నారు.
తాజాగా- ఆయన అభ్యర్థిత్వంపై వ్యతిరేకత ఎదురవుతోంది. సత్తెనపల్లి టికెట్ ను మరోసారి కోడెలకు ఇవ్వకూడదని అంటూ స్థానిక తెలుగుదేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోడెల వద్దు.. అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో బైఠాయించారు. కోడెలకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఇస్తే.. ఓడిస్తామని కూడా హెచ్చరిస్తున్నారు.
నిరసన..డ్రామానా?
ఈ తతంగం వెనుక పార్టీ అగ్ర నాయకత్వం హస్తం ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. నరసరావు పేట లోక్ సభ స్థానం నుంచి కోడెలను బరిలోకి దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ విషయాన్ని కోడెలకు కూడా ఫోన్ ద్వారా తెలియజేశారు. నరసరావు పేట నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఆయన కుమారుడు కోడెల శివరామ్ కు నరసరావు పేట అసెంబ్లీ టికెట్ ఇస్తామని అన్నారు. లోక్ సభ కు పోటీ చేయడానికి శివప్రసాద రావు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. కోడెలకు టిక్కెట్ కేటాయింపు విషయాన్ని చంద్రబాబు తేల్చలేదు. తాను సత్తెనపల్లి నుంచే పోటీ చేస్తానంటూ కోడెల పలుమార్లు చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ.. పట్టించుకోవట్లేదు. పైగా నిరసన డ్రామాలను తెరమీదికి తీసుకొచ్చారని అంటున్నారు.