రాం మాధవ్ ఆ వ్యాఖ్యల వెనుక అర్థమేంటి?:డిప్యూటీ సీఎం కేఈ;జగన్ ని అరెస్ట్ చేసైనా విచారణ:మంత్రి నక్కా
అమరావతి:ప్రతిపక్ష నేత జగన్ పై దాడి నేపథ్యంలో వైసిపి, బీజేపీ నేతల విమర్శలపై డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి, సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు.
బిజెపి రాముడి పేరు చెప్పి అధికారంలోకి వచ్చి రావణాసురుడిలా వ్యవహరిస్తోందని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి భారతీయ జనతా పార్టీని దుయ్యబట్టగా....జగన్ ను అరెస్ట్ చేసైనా విచారణ చేస్తామని మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నుద్దేశించి బిజెపి నేత రామ్మాధవ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటని ఇద్దరు మంత్రులు నిలదీశారు.
ఆ వ్యాఖ్యల వెనుక...అర్థమేంటి?
గుంటూరులో బిజెపి నేత రామ్ మాధవ్ మాట్లాడుతూ కేంద్రం సంగతి తరువాత...ముందు నీ పదవి గురించి ఆలోచించుకోమన్నారని...రామ్మాధవ్ వ్యాఖ్యల వెనుక అర్థమేమిటని ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఎపి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా రామ్ మాధవ్ ప్రయత్నిస్తున్నారా? అని ఆయన నిలదీశారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే నోరు మెదపని బీజేపీ నేతలు చిల్లర విషయాలకు మాత్రం తెగ మాట్లాడుతున్నారని డిప్యూటీ సిఎం కెఈ కృష్ణమూర్తి దుయ్యబట్టారు.
సిబిఐ విచారణ...మంచిదే
ఎప్పుడో దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వదిలేసిన రామ్ మాధవ్, జీవీఎల్ ఇప్పుడు రాష్ట్రంపై ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. రాముని పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ రావణాసురునిలా వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుమలపై కుట్ర చేసిన తరహాలోనే శబరిమలలోనూ కుట్ర చేసే పనిలో కేంద్రం బిజీగా ఉందని ఆరోపించారు. దాడికి సంబంధించి సీబీఐ విచారణను జగన్ కోరడం మంచిదేనని...మరి అదే సీబీఐ నిర్ధారించిన రూ.44 వేల కోట్ల అవినీతిని జగన్ ఒప్పుకుంటే మంచిదని కేఈ కృష్ణమూర్తి వ్యాఖ్యనించారు.
ఆ అర్హత..ఉందా?
మరోవైపు గుంటూరులో మంత్రి నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవస్థల మీద నమ్మకం లేదంటున్న జగన్ కి అసలు ఈ రాష్ట్రంలో పోటీచేసే అర్హత ఉందా?...అని ప్రశ్నించారు. ఇలా మట్లాడటం రాష్ట్ర ప్రజలను అవమానించడం కాదా?...అని నిలదీశారు. తనపై దాడి జగన్మోహన్ రెడ్డే చేయించుకున్నాడన్న సంగతి అందరికీ తెలిసిపోయిందన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డే దీనిపై ప్రజలకు సమాధానం చెప్పాలని మంత్రి నక్కా ఆనందబాబు డిమాండ్ చేశారు. పాదయాత్రకి స్పందన లేకపోవడంతోనే జగన్ ఇలా దాడి చేయించుకున్నారని మంత్రి నక్కా వ్యాఖ్యానించారు.
అరెస్ట్ చేసైనా...విచారణ
దర్యాప్తు సంస్థలకు సహకరించకపోవడం కూడా నేరమే...తనకు దెబ్బతగిలిందని చెప్పిన జగన్...దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి అధికారపార్టీ మీద నెపం వేస్తే సరిపోదని...విచారణకు సహకరించాలని నక్కా ఆనందబాబు సూచించారు. "విశాఖపట్టణం వచ్చి పోలీసుల విచారణకు సహకరించాలి...లేనిపక్షంలో నిన్ను అరెస్ట్ చేసయినా అయినా విచారణ జరిపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఆ విధంగా నైనా మేము చేస్తాం"...అని మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు.