హెలికాప్టర్ ఇప్పిస్తే జగన్ దగ్గరికొస్తానన్నా. కేంద్రం కూడా ఒప్పుకోదు: అచ్చెన్నాయుడు మండిపాటు
''రాష్ట్రంలోనేకాదు.. దేశంలో ఏఒక్కరైనా.. ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎందుకు జరుగుతున్నాయో చెబితే మేం సంతోషిస్తాం. గురువారం తర్వాత మూడ్రోలు గ్యాపిచ్చారు. సోమవారం ఉదయం 11 గంటలకు హడావుడిగా అసెంబ్లీని ప్రారంభించారు. ఐదు నిమిషాలు తిరక్కముందే బీఏసీ సమావేశం కోసం సభను వాయిదా వేశారు. సరిగ్గా 11:13 గంటలకు.. బీఏసీ సమావేశానికి రావాలంటూ నాకు ఫొనొచ్చింది. ఒక హెలికాప్టర్ ఇప్పిస్తే ఇప్పటికిప్పుడు సీఎం జగన్ ఎక్కడికి రమ్మంటే అక్కడికొస్తానని చెప్పాను. దెబ్బకి ఫోన్ పెట్టేశారు. గౌరవ శాసనసభను నడిపే తీరు ఇదా?'' అంటూ టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.
వైసీపీ విలవిల
వైసీపీ ప్రభుత్వం సభా నియమాలకు విరుద్ధంగా అసెంబ్లీని నిర్వహిస్తున్నదని, వికేంద్రీకరణ బిల్లుపై చర్చకు మూడ్రోజులు సరిపోదని టీడీపీ ముందే చెప్పినా పెడచెవినపెట్టారని, ఇప్పుడేం చెయ్యాలో పాలుపోక విలవిల్లాడుతున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. సోమవారం అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. శాసనసభలో మండలి రద్దు తీర్మానం, హడావుడిగా బీఏసీ మీటింగ్ నిర్వహణ తదితర పరిణామాలపై ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.
మండళ్లు సరే.. మూడు రాజధానులున్నాయా?
మండలి రద్దుపై సీఎం జగన్, వైసీపీ నేతలు చేస్తున్నదంతా పిడివాదమేనని అచ్చెన్న చెప్పారు. దేశంలోని 22 రాష్ట్రాల్లో శాసన మండలి లేదు కాబట్టి, ఏపీలో కొనసాగించాల్సిన అవసరం లేదంటోన్న జగన్ కు.. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మూడు రాజధానులు లేవన్న సంగతి తెలియదా? అని ఎద్దేవాచేశారు. కేవలం అమరావతిపై కక్షతో ఏపీని సర్వనాశనం చేస్తున్నారని, గతంలో ఇదే వైసీపీ ప్రభుత్వం పంపిన 32 బిల్లుల్ని మండలి ఆమోదించిందని, వికేంద్రీకరణ అనేది ప్రజావ్యతిరేక బిల్లు కాబట్టే అడ్డుకున్నామని తెలిపారు.
పార్లమెంట్ కు పోతుందా?
వికేంద్రీకరణ బిల్లు విషయంలో వైసీపీ ప్రభుత్వం తప్పులమీద తప్పులు చేస్తోందని, అసలు ఎగువ సభలో జరిగిన వ్యవహారాల్ని దిగువ సభలో చర్చించిన సందర్భాలు దేశంలో ఎక్కడా చోటుచేసుకోలేదని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. సెలెక్ట్ కమిటీ నిర్ణయం వచ్చినదాకా స్టేటస్ కో పాటించాలని హైకోర్టు చెప్పినా జగన్ చెవికెక్కడంలేదని, ఇంత లోపభూయీష్టమైన బిల్లును కేంద్రం అంగీకరించబోదని, పార్లమెంటులో సీఎం పప్పులు ఉడికే అవకాశమేలేదని అభిప్రాయపడ్డారు.
నీతి సూక్తులు నీటిపాలు..
‘‘వేరే పార్టీల నుంచి ఎవరైనా వైసీపీలో చేరాలనుకుంటే ముందుగా పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుందని, తాను దేశంలోనే గొప్ప ఆదర్శాన్ని పాటిస్తానని సీఎం జగన్ నీతి సూక్తులు చెప్పారు. ఇప్పుడేమో టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, ఎమ్మెల్సీ పోతుల సునీతను సిగ్గులేకుండా పార్టీలో చేర్చుకున్నారు. విశాఖ రాజధానిపై టీడీపీని ప్రశ్నిస్తోన్న స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావులకు గతంలో మంత్రులుగా పనిచేసినప్పుడు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం గుర్తుకురాలేదా?'' అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.