ఫిరాయింపుల వేళ: ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు మహానాడులో కీలక బాధ్యతలు: హాజరు.. డౌటే
అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ తెలుగుదేశం పార్టీ ఫిరాయింపుల బెడదను ఎదుర్కొంటోంది. కరోనా వైరస్ వల్ల పరిస్థితులు తలకిందులుగా మారిన నేపథ్యంలో కొంతకాలం పాటయినా ఫిరాయింపులు ఉండబోవని ఆశించిన టీడీపీ అగ్ర నాయకత్వానికి హైఓల్టేజ్ షాక్ ఇస్తున్నారు ఎమ్మెల్యేలు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఏడుమంది పార్టీ ఫిరాయించడానికి రెడీగా ఉన్నారు. వారిలో ఇద్దరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైంది. గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పేర్లు వినిపిస్తున్నాయి.
పసుపు పండుగ అజెండా: అదొక్కటే టార్గెట్..ఎన్టీఆర్కు భారతరత్న: సంక్షోభాన్ని ఇలా అవకాశంగా
ప్రతికూల పరిస్థితుల మధ్య..
ఫిరాయింపులను ఎదుర్కొంటోన్న వేళ తెలుగుదేశం పార్టీ డిజిటల్ ప్లాట్ఫారం ఆధారంగా మహానాడును నిర్వహించబోతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపినట్టవుతుందనే ఉద్దేశం పార్టీ అగ్ర నాయకత్వంలో బలంగా కనిపిస్తోంది. అందుకే- పరిస్థితులు అనుకూలించకపోయినప్పటికీ.. ఆన్లైన్ ద్వారా మహానాడును నిర్వహించడానికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాట్లను పూర్తి చేశారు.
మహానాడు రెండో రోజు కీలక అంశంపై ప్రసంగించనున్న అనగాని
పనిలో పనిగా ఫిరాయిస్తారని భావిస్తోన్న అనగాని సత్యప్రసాద్ వంటి నాయకులకు కీలక బాధ్యతలను అప్పగించారు.
డిజిటల్ మహానాడు సందర్భంగా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్కు కీలక బాధ్యతలను అప్పగించారు చంద్రబాబు నాయుడు. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి విజయం సాధించిన ఆయన కీలకోపన్యాసం చేయడానికి ప్రధాన అంశాలను ఎంపిక చేశారు. మహానాడు రెండో రోజు అనగాని సత్యప్రసాద్ ధరల పెరుగుదల అంశంపై ప్రసంగించాల్సి ఉంది.
ధరల పెరుగుదలపై
మహానాడు షెడ్యూల్ ప్రకారం- గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ధరల పెరుగుదల, ప్రజలపై 50 వేల కోట్ల రూపాయల మేర అదనపు భారాలు అనే అంశంపై సత్యప్రసాద్.. కోట్ల సుజాతమ్మ, సంధ్యారాణిలతో కలిసి అనగాని సత్యప్రసాద్ ప్రసంగించాల్సి ఉంది. పసుపు పండుగకు ఆయన హాజరవుతారా? ఈ అంశంపై ప్రసంగిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఆయన హాజరుపై టీడీపీ నాయకుల్లో అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
పార్టీ ఫిరాయించడానికి రెడీ అయిన వేళ..
అదే సమయంలో- సత్యప్రసాద్ పార్టీలో కొనసాగుతారా? లేదా? అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమౌతున్నాయి. తన తోటి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలిసి వైసీపీలో చేరడానికి ఆయన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా- ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితోనూ మంతనాలు నిర్వహించారు. ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం ఒక్కటే మిగిలి ఉందని అంటున్నారు పార్టీ నాయకులు. ఈ పరిస్థితుల్లో అనగాని సత్యప్రసాద్ షెడ్యూల్ ప్రకారం.. మహానాడుకు హాజరవుతారా? అనేది అనుమానమే.
Recommended Video
బుజ్జగింపులో భాగమేనంటూ
గుంటూరు జిల్లాలో బలమైన నాయకుడిగా పేరు ఉంది సత్యప్రసాద్కు. గత ఏడాది ముగిసిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజాన్ని సైతం తట్టుకుని నిల్చున్నారాయన. గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి మోపిదేవి వెంకటరమణను మట్టికరిపించారు. అలాంటి బలమైన నాయకుడిని కోల్పోవడం ఇష్టం లేదనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారని, ఆయనను బుజ్జగించడంలో భాగంగా.. మహానాడులో కీలక బాధ్యతలను అప్పగించారని అంటున్నారు. అయినప్పటికీ..సత్యప్రసాద్ పార్టీని వీడటం ఖాయంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.