జగన్ అన్నయ్యకు కుర్రతనం ఇంకా పోలేదు: రోజా సస్పెన్షన్ తీర్పుపై అనిత
హైదరాబాద్: అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్కు గురైన రోజాకు హైకోర్టు డివిజెన్ బెంచ్లో చుక్కెదురైన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడారు. ఈరోజు తనకెంతో శుభదినమని ఆమె చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యే రోజా విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు దళితులు ఆత్మగౌరవాన్ని నిలబడిందని అన్నారు.
అహంకారం ఎంత దారుణంగా ఓడుతుందో ఈరోజే తెలిసిందని, తన ఆవేదనే గెలిచిందని ఆమె చెప్పారు. సభలో ఎలా ప్రవర్తించాలో తెలుసుకునేందుకు వైసీపీ సభ్యులు ఎక్కడికైనా వెళ్లి శిక్షణ తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష నాయుకుడిది అవగాహనరాహిత్యం అనుకున్నామని చెప్పారు.
అయితే ఇంకా కుర్రతనం పోలేదు మా అన్నకి అంటూ వైయస్ జగన్ను ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు. అన్నయ్య జగన్... రోజా కోసం నల్లచొక్కాలు వేసుకుని సభకు రావడం కాకుండా ప్రజా సమస్యలపై పోరాటానికి నల్లచొక్క వేసుకోవాలని అన్నారు. వ్యక్తి కోసం వ్యవస్థలను దెబ్బతీయవద్దన్నారు.
జగన్కు ఇప్పటికైనా కనువిప్పు కలగాలని అన్నారు. సభా హక్కులను కాపాడినందుకు హైకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు బోండా ఉమ, కూన రవికుమార్ కూడా వైసీపీ తీరును తప్పుపట్టారు. కోర్టు తీర్పును చూసి మహిళలంతా గర్వపడుతున్నారని అన్నారు.
ప్రభుత్వం ఉదారంగా ఉంది కాబట్టే ప్రివిలేజ్ కమిటీ ముందు క్షమాపణ చెప్పేందుకు రోజాకు మరో అవకాశం ఇచ్చిందన్నారు. వైసీపీ అహంకారం అనే ఆయుధంతో పనిచేయాలనుకుంటోందని విమర్శించారు. కాగా రోజాకు మంగళవారం హైకోర్టులో చుక్కెదురైన సంగతి తెలిసిందే.
ఆమె సస్పెన్షన్పై సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై డివిజన్ బెంచ్ స్టే విధించింది. రోజా సస్పెన్షన్ వ్యవహారంలో హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసంబ్లీ కార్యదర్శి అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాలు వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను మంగళవారం కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.