వైసీపీలోకి గంటా శ్రీనివాస్ ? ముహుర్తం ఫిక్స్ చేసిన జగన్ ? - వారు వద్దంటున్నా...
ఏపీలో గతేడాది అధికారం చేపట్టిన తర్వాత పలువురు టీడీపీ ఎమ్మెల్యేలకు రెడ్ కార్పెట్ పరిచిన వైసీపీ అధినేత, సీఎం జగన్ తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విశాఖకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ వైసీపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టు 15న రాష్ట్రంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంచేందుకు సిద్ధమవుతున్న సీఎం జగన్... అదే రోజు గంటాను కూడా పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.అదే జరిగితే విశాఖ రాజకీయాల్లో వైసీపీ హవా మొదలు కావడానికి ఈ చేరిక కీలకం కానుంది.
వైసీపీలోకి గంటా ?
గత రెండు ప్రభుత్వాల హయాంలో మంత్రిగా వ్యవహరించి కీలక నేతల్లో ఒకరిగా ఎదిగిన గంటా శ్రీనివాసరావు ఈసారి కూడా టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్ధిగా గెలిచిన గంటా సొంత పార్టీ టీడీపీతో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. గతంలో చంద్రబాబు విశాఖ పర్యటన నేపథ్యంలో కానీ, ఆ తర్వాత పలు సందర్భాల్లోనూ టీడీపీకి దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాస్... అసెంబ్లీ సమావేశాలకు కూడా అంతంతమాత్రంగానే హాజరవుతున్నారు. దీంతో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరవచ్చన్న ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే తాజాగా సీఎం జగన్ కు సన్నిహితంగా ఉండే వారితో చర్చలు జరిపిన గంటా వైసీపీకి మద్దతుగా నిలిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
జగన్ గ్రీన్ సిగ్నల్ ?
విశాఖపట్నాన్ని ఏపీ కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించిన జగన్... ఆ మేరకు నగరంలో వైసీపీని బలోపేతం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఓ వైపు ప్రభుత్వం తరఫున నగర అభివృద్ధికి ప్రణాళికలు ప్రకటిస్తూనే.. మరోవైపు స్ధానిక నేతలను పార్టీలోకి రప్పించేందుకు జగన్ సన్నిహితులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్న గంటా శ్రీనివాస్ ను పార్టీలోకి రప్పించడం ద్వారా నగరంలో పూర్తిగా పట్టు సాధించవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా జగన్ సన్నిహితులతో జరిపిన చర్చలు ఫలించడంతో ఆయన రాకకు అధినేత గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది.
పంద్రాగస్టు ముహుర్తం...
వచ్చే నెల 15న ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు భారీ ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీకి రంగం సిద్దం చేస్తోంది. అదే రోజు వైసీపీలోకి గంటా చేరికకు ముహుర్తం ఖరారు చేసినట్లుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇళ్ల స్ధలాల పంపిణీ కార్యక్రమానికి వేదిక ఇంకా ఖరారు కాకపోయినా విశాఖ అయితే బావుంటుందని వైసీపీ నేతలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ కార్యక్రమం విశాఖలో జరిగితే అక్కడే జగన్ ను కలిసి వైసీపీకి గంటా మద్దతు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కుదరకపోతే మాత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చి కలిసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
Recommended Video
వ్యతిరేకిస్తున్న అవంతి, సాయిరెడ్డి ?
ఇప్పటికే విశాఖ రాజకీయాల్లో కీలకంగా మారిపోయిన ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు భీమిలి ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్ గంటా రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే గంటాకు వ్యతిరేకంగా వైసీపీలో పావులు కదుపుతున్న వీరిద్దరూ గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా చేతిలో ఓడిపోయిన కేకే రాజుకు మద్దతిస్తున్నారు. కేకే రాజును మరోసారి అదే స్ధానం నుంచి 2024 ఎన్నికల్లో బరిలోకి దించేందుకు ప్రయత్నిస్తున్న వీరికి గంటా రాకతో ఆ అవకాశం లేకుండా పోతోంది. దీంతో గంటాను వైసీపీలోకి తీసుకోబోమని సాయిరెడ్డి ఇప్పటికే ఓసారి బహిరంగంగానే ప్రకటించారు. అయితే జగన్ సన్నిహితుల లాబీయింగ్ మేరకు గంటాకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.