ఆ సీటులో గోరంట్ల బుచ్చయ్యే పోటీ
Rajahmundry Rural: రాజమండ్రి రూరల్. తెలుగుదేశం పార్టీకి కంచుకోట. నియోజకవర్గంగా ఆవిర్భవించిన తరువాత టీడీపీ ఒక్కసారి కూడా ఓడి పోని స్థానం ఇది. ఇప్పటివరకు మూడు ఎన్నికలను ఎదుర్కొనగా.. వాటన్నింట్లోనూ పసుపు జెండానే ఎగిరింది. ఇక ముందు కూడా అదే పరిస్థితి ఉండొచ్చు.
2009, 2014, 2019 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టింది టీడీపీ. 2009లో చందన రమేష్, ఆ తరువాతి ఎన్నికల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించారు. 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని టీడీపీ కైవసం చేసుకున్న నియోజకవర్గాల్లో ఇదీ ఒకటి.

ఈ స్థానం టీడీపీ చేజారడం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీతో ఉన్న పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానంపై జనసేన పార్టీ కర్చీఫ్ వేసింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు కందుల దుర్గేష్.. ఇక్కడి నుంచి పోటీ చేయడం దాదాపుగా ఖరారైందంటూ వార్తలు వెలువడ్డాయి.
ఈ ఉదయం పవన్ కల్యాణ్.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నాయకులతో సమావేశం అయ్యారు. రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్, రాజానగరం, అనపర్తి నియోజకవర్గాల ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్కు దుర్గేష్ పేరును ఖరారు చేసినట్లు వార్తలొచ్చాయి.
దీనిపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులకు సూచనలు చేశారు. మీడియాలో వస్తోన్న వార్తలు ఊహాజనితమైనవని, అవి నమ్మి భావోద్వేగాల కి గురి అవ్వొద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడి ఆదేశానుసారం ఖచ్చితంగా తానే పోటీలో ఉంటానని అన్నారు.
ఇందులో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దీనిపై త్వరలోనే చంద్రబాబు ఓ అధికారిక ప్రకటన విడుదల చేస్తారని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ స్థానాన్ని జనసేనకు వదలదలచుకోలేదనే సందేశాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇచ్చినట్టయింది.












Click it and Unblock the Notifications