2019నుండి ఇప్పటివరకు జగన్ చేసిన మంచిపని అదొక్కటే: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల ఆసక్తికర వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఏపీలో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక ఇదే సమయంలో జిల్లాల పేర్లు కూడా ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై వివిధ జిల్లాలలోని నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, మరికొందరు కొత్త జిల్లాల ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Recommended Video
ఏపీ జిల్లాల పునర్విభజనపై స్పందిస్తున్న నేతలు .. ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటుపై హర్షం
ఇక తాజాగా ఏపీలో జిల్లాల పునర్విభజన పై ప్రతిపక్ష నేతలు సైతం స్పందిస్తున్నారు. కృష్ణా జిల్లాను విభజించి ఎన్టీఆర్ జిల్లాగా ఏర్పాటు చేయడంపై ఇప్పటికే పురంధరేశ్వరి, చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు స్పందించి జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.
తన తండ్రి నందమూరి తారకరామారావు పేరుతో ఎన్టీఆర్ జిల్లా ను ప్రకటించిన ఏపీ ప్రభుత్వానికి ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ సైతం కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు వారందరూ గర్వ పడేలా ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
జగన్ 100 పనులు చేస్తే అందులో 99 శుద్ధ తప్పులు .. కానీ
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై ప్రముఖ నిర్మాత దర్శకుడు వైవీఎస్ చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విజయవాడ కేంద్రం గా ఎన్టీఆర్ జిల్లాను ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక తాజాగా టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఏపీ జిల్లాల పునర్విభజనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2019నుంచి జగన్ పాలనలో వంద పనులు చేస్తే అందులో 99 శుద్ధ తప్పులు ఉన్నాయని, ఆ తప్పులతో జగన్ ప్రభుత్వం ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శలు గుప్పించారు.
ఒక్క మంచి పని చేశారన్న టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ప్రతి తప్పుకి ప్రజలను డైవర్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరల గురించి ప్రశ్నిస్తే ఒక సమాధానం లేదని, రాష్ట్ర అప్పుల గురించి ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం లేదని పేర్కొన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక హోదా పైన కూడా సమాధానం లేదని , ఉద్యోగుల సమస్యలపై కూడా సమాధానం లేకుండా ప్రభుత్వ పాలన కొనసాగుతుందని ఆరోపణలు గుప్పించారు. ఏది ఏమైనా జగన్ 99 తప్పులు చేసినా ఒక్క మంచి పని చేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టటం ఒక్కటే జగన్ చేసిన మంచి పని
అది ఏంటంటే జిల్లాల పునర్విభజనలో కృష్ణా జిల్లాను పునర్విభజన చేసి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం ఒక్కటే మంచి పని అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టాలని జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఇటు వైసీపీ మంత్రి కొడాలి నాని సైతం సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే విజయవాడ సమీపంలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గం మచిలీపట్నం కేంద్రంగా ఉండే కృష్ణాజిల్లాలో కాకుండా ఎన్టీఆర్ జిల్లాలో కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.