Kolikapudi: టీడీపీ హైకమాండ్ కు కొలికపూడి వివరణ..! చర్యలు తప్పవా ?
తిరువూరులో ఓ గిరిజన మహిళపై దాడి చేసి అవమానించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇవాళ పార్టీ అధిష్టానానికి వివరణ ఇచ్చారు. కొలికపూడిపై వచ్చిన ఆరోపణలపై అధిష్టానం గతంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో ఆయన ఇవాళ పార్టీ పెద్దల ముందు హాజరై రాతపూర్వక వివరణ ఇచ్చారు. దీనిపై విచారించి కొలికపూడిపై తదుపరి చర్యల్ని అధిష్టానం ఖరారు చేయబోతోంది.

తిరువూరు నియోజకవర్గంలోని ఎ. కొండూరు మండలం గోపాలపురంలో టీడీపీ గ్రామ కార్యదర్శి భూక్యా రాంబాబు ఇంటికి ఈ నెల 11న వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్.. ఆయన సోదరుడు అయిన వైసీపీ నేత భూక్యా కృష్ణకు చెందిన భూ వివాదంపై హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కృష్ణ భార్యను సైతం ఇంట్లో దూరి కొట్టి అవమానించారని ప్రత్యర్థులు ఆరోపించారు. దీనిపై టీడీపీ హైకమాండ్ కొలికపూడి వివరణ కోరింది.
ఈ వ్యవహారంపై ఇవాళ టీడీపీ క్రమశిక్షణా కమిటీ ముందు హాజరైన కొలికపూడి.. రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు. అనంతరం కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో వచ్చేది వేరని, వాస్తవం వేరని తెలిపారు. కంచె తొలగింపు యాదృచ్ఛికంగా జరిగిందని, అక్కడికి వెళ్లే వరకూ కంచె విషయం తనకు తెలియదని చెప్పారు. తనపై ఫిర్యాదు చేసిన వారే ఇవాళ తనతో కలిసి పనిచేస్తున్నారని కొలికపూడి తెలిపారు. తిరువూరు ప్రజలకు వాస్తవాలు తెలుసన్నారు.
మరోవైపు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఈ వ్యవహారంపై స్పందించారు. కొలికపూడి గీత దాటినట్లు తెలుస్తోందన్నారు. చంద్రబాబు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కొలికపూడికి సూచించారు. ఇకనైనా కొలికపూడి వ్యవహారశైలి మార్చుకుని అందరితో కలిసి ముందుకెళ్లాలన్నారు. కొలికపూడిపై రిపోర్ట్ అధినేత చంద్రబాబుకు సమర్పిస్తామని, దాన్ని బట్టి చర్యలు ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications